కర్నాటక ఎన్నికలు: గాలి జనార్ధన్ రెడ్డికి బీజేపీ అధిష్టానం షాక్!
బళ్లారి: మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి బీజేపీ షాకిచ్చింది. తన అనుచరులకు పలువురికి నుంచి టికెట్లు ఇప్పించుకున్న గాలి.. గత నాలుగు రోజులుగా ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. బీజేపీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఆయన ప్రచారానికి దూరంగా ఉంటున్నారట.
బాదామి నియోజకవర్గంలో గాలి ప్రధాన అనుచరుడు శ్రీరాములు బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో గాలి మాట్లాడుతూ.. బాదామిలో సిద్ధ రావణ (సిద్ధరామయ్య)ను మా శ్రీరాముడు సంహరిస్తాడంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. గాలి వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది.
మరోవైపు, బీజేపీలోని కొందరు నేతలు కూడా ఈ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలంటూ గాలిని పార్టీ అధిష్ఠానం ఆదేశించినట్టు తెలుస్తోంది.
శ్రీరాములు నామినేషన్ వేసిన సమయంలో జరిగిన ర్యాలీలో శ్రీరాములు పక్కనే గాలి ఉన్నారు. ఏప్రిల్ 21న జరిగిన ఓ సభలో యెడ్యూరప్పతో కలిసి వేదిక కూడా పంచుకున్నారు.