బళ్లారి జిల్లాకు గాలి జనార్దన్ రెడ్డి, ఐసీయూలో మామ: సుప్రీం కోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి !
న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి తాను బళ్లారి జిల్లాలో ప్రవేశించడానికి అనుమతి ఇవ్వాలని సుప్రీం కోర్టులో అర్జీ సమర్పించారు. అనారోగ్యంతో భాదపడుతున్న తన మామను చూడటానికి అవకాశం కల్పించాలని మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సుప్రీం కోర్టులో మనవి చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గాలి జనార్దన్ రెడ్డి ప్రస్తుతం బళ్లారి జిల్లాలో అడుగు పెట్టడానికి అవకాశంలేదు.
ఐసీయూలో మామ
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మామ అనారోగ్యంతో భాదపడుతున్నారు. తన మామను ఆసుపత్రిలో పరామర్శించడానికి అవకాశం ఇవ్వాలి గాలి జనార్దన్ రెడ్డి మంగళవారం సుప్రీం కోర్టులో అర్జీ సమర్పించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న తన మామను చూడటానికి ఇవ్వాలని గాలి జనార్దన్ రెడ్డి సమర్పించిన అర్జీని సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ (సెలవుల కోర్టు) పరిశీలించారు.
అవకాశం లేదు
ప్రస్తుతం సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి బళ్లారి జిల్లాలో అడుగు పెట్టడానికి అవకాశం లేదు.
కుమార్తె వివాహం చెయ్యడానికి గాలి జనార్దన్ రెడ్డి గతంలో బళ్లారి జిల్లాకు వెళ్లారు. 2016 నవంబర్ 16వ తేదీన గాలి జనానర్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మిణి వివాహం జరిగింది. నవంబర్ 1 నుంచి నవంబర్ 21 వ తేదీ వరకు కుమార్తె వివాహం చెయ్యడానికి గాలి జనార్దన్ రెడ్డి బళ్లారి జిల్లాలో ఉండటానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది.
సుప్రీం కోర్టు నో
2018 శాసన సభ ఎన్నికల సందర్బంగా బళ్లారిలో తన సోదరుడు గాలి సోమశేఖర్ రెడ్డికిమద్దతుగా ఎన్నికల ప్రచారం చెయ్యడానికి అవకాశం ఇవ్వాలని గాలి జనార్దన్ రెడ్డి సుప్రీం కోర్టులో అర్జీ సమర్పించారు. అయితే గాలి జనార్దన్ రెడ్డి సమర్పించిన అర్జీలో ఎలాంటి బలమైన కారణాలు లేవని గాలి జనార్దన్ రెడ్డి బళ్లారి జిల్లా వెళ్లడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది.
షరతులతో జామీను
అక్రమ గనుల కేసులో గాలి జనార్దన్ రెడ్డి ప్రముఖ ఆరోపి. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. 2015లో షరులతులతో కూడిన జామీనుతో గాలి జనార్దన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చారు. బళ్లారి జిల్లాలో అడుగు పెట్టడానికి వీలులేదని, కేసుకు సంబంధించిన సాక్షాలు నాశనం చెయ్యడానికి వీలులేదని సుప్రీం కోర్టు షరతులో కూడిన జామీను గాలి జనార్దన్ రెడ్డికి మంజూరు చేసింది
రాజకీయాల్లోకి రీ ఎంట్రీ !
అక్రమ గనుల కేసుకు సంబంధించి జైలుకు వెళ్లి జామీను మీద బయటకు వచ్చిన గాలి జనార్దన్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న గాలి జనార్దన్ రెడ్డి సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ తన సన్నిహితులతో టచ్ లో ఉన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని గాలి జనార్దన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. అయితే లేనిపోని సమస్యలు వస్తాయని గాలి జనార్దన్ రెడ్డిని బీజేపీ నాయకులు దూరం పెట్టారని తెలిసింది.