సీసీబీ పోలీసులను కాశ్మీర్ కు పంపించండి: సీఎం సూపర్: ఒత్తిడి, గాలి జనార్దన్ రెడ్డి ఫైర్!
Recommended Video
బెంగళూరు: బెంగళూరు సీసీబీ పోలీసులు దేశానికి ఆదర్శంగా నిలిచారని, ఇలాంటి పోలీసులను తాను జీవితంలో చూడలేదని కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి వ్యంగంగా అన్నారు. తనను అరెస్టు చేసే అవకాశం లేనప్పుడు రాజకీయ ఒత్తిడితో సీసీబీ పోలీసులు అరెస్టు చేసి స్వామి భక్తిని చాటుకున్నారని గాలి జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. ఇలాంటి పోలీసు అధికారులను సీఎం కుమారస్వామి జమ్మూ కాశ్మీర్ కు పంపించాలని గాలి జనార్దన్ రెడ్డి ఎద్దేవ చేశారు.
రాజకీయ ఒత్తిడి
పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి విడుదలైన గాలి జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసులో 20 గంటలకు పైగా తనను విచారణ చేశారని, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తాను ఎన్నిసార్లు చెప్పినా రాజకీయ ఒత్తిడితో అరెస్టు చేసి జైలుకు పంపించారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు.
జమ్మూ కాశ్మీర్
సీసీబీ పోలీసుల మీద రాజకీయ నాయకుల ఒత్తిడి ఎంత ఉంటుందో తాను ఊహించగలనని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. సీసీబీ విభాగం జాయింట్ పోలీసు కమీషనర్ అలోక్ కుమార్, డీసీపీ గిరీష్ నెంబర్ 1 అధికారులు అని, ఇలాంటి అధికారులు కర్ణాటకకు అవసరం లేదని గాలి జనార్దన్ రెడ్డి విరుచుకుపడ్డారు.
సీఎం కుమారస్వామికి మనవి
కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామికి తాను ఒక్క మనవి చేస్తున్నానని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. ఐపీఎస్ అధికారులు అలోక్ కుమార్, గిరీష్ లను జమ్మూ కాశ్మీర్ కు పంపించాలని, అప్పుడు దేశం మొత్తం కుమారస్వామి గురించి చర్చించుకుంటుందని గాలి జనార్దన్ రెడ్డి ఎద్దేవ చేశారు.
నాయకుల మాటలు వింటారు
ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసులో తనను అరెస్టు చేసే అవసరం ఎంత మాత్రం లేదని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. అధికారంలో ఉన్న నాయకుల మాటలు విని సీసీబీ పోలీసులు తనను అరెస్టు చేశారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. అధికారంలో ఉన్న నాయకులు మాటలు వినే ఇలాంటి పోలీసు అధికారులు జమ్మూ కాశ్యీరులో ఉంటే చాల బాగుంటుందని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు.
న్యాయమూర్తి చెప్పారు
ఆంబిడెంట్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదు, ఈ విషయం న్యాయమూర్తి కూడా చెప్పారని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. సీసీబీ పోలీసులు రాజకీయ ఒత్తిడితో తాను బెంగళూరు వదిలి పారిపోయానని తప్పుడు ప్రచారం చేయించారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. రాజకీయంగా తనను ప్రజల్లో చులకన చేయించడానికి కర్ణాటక ప్రభుత్వ పెద్దలు ప్రయత్నించారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు.