గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు: రూ. లక్ష బాండ్, వ్యక్తిగత పూచి, ఈ రోజు జైల్లోనే ?
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కి షరతులతో బెయిల్ మంజూరు అయ్యింది. బుధవారం బెంగళూరులోని 1వ ఏసీఎంఎం న్యాయస్థానం గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు చెయ్యడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. సాయంత్రం బెయిల్ మంజూరు కావడంతో వాటి పత్రాలను సరైన సమయంలో పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తీసుకెళ్లే అవకాశం చాల తక్కువగా ఉందని సమాచారం.
డీల్ లేదు
ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసు నుంచి తప్పిస్తామని గాలి జనార్దన్ రెడ్డి ఎవ్వరితో డీల్ కుదుర్చుకోలేదని, ఆయనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని ఆయన న్యాయవాదులు కోర్టులో వాదించారు. గాలి జనార్దన్ రెడ్డిని కావాలనే ఈకేసులో ఇరికించారని ఆయన న్యాయవాదులు ఆరోపించారు.
గాలికి లింక్ ఉంది
ఆంబిడెంట్ కంపెనీ నిర్వహకులతో గాలి జనార్దన్ రెడ్డి ఫైవ్ స్టార్ హోటల్ లో భేటీ అయ్యారని సీసీబీ పోలీసులు ఆరోపించారు. ఆంబిడెంట్ కేసు నిర్వహకులను కేసు నుంచి తప్పిస్తానని గాలి జనార్దన్ రెడ్డి వారికి హామీ ఇచ్చారని సీసీబీ పోలీసులు అంటున్నారు.
ప్రతిఫలంగా 57 కేజీల బంగారం
ఈడీ నమోదు చేసిన కేసు నుంచి తప్పిస్తానని గాలి జనార్దన్ రెడ్డి హామీ ఇవ్వడంతో ఆంబిడెంట్ నిర్వహకులు ఆయన సన్నిహితుడు ఆలీఖాన్ కు 57 కేజీల బంగారం ఇచ్చారని సీసీబీ పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే నమోదు అయిన ఈ కేసును ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు.
గాలికి బెయిల్
బెంగళూరులోని 1వ ఏసీఎంఎం న్యాయస్థానంలో గాలి జనార్దన్ రెడ్డికి షరతులతో బెయిల్ మంజూరు అయ్యింది. రూ. 1 లక్ష బాండ్, ఇద్దరు వ్యక్తుల షూరుటి (వ్యక్తిగత పూచి) ఇవ్వడంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గాలి జనార్దన్ రెడ్డికి మాలూరుకు చెందిన రఘురామ రెడ్డి, నంజుడ రెడ్డి అనే వ్యక్తులు వ్యక్తిగత పూచి ఇచ్చారు.
సమయం లేదు మిత్రమా
బుధవారం సాయంత్రం గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు అయ్యింది. బెయిల్ పేపర్లు చేతికి వచ్చిన తరువాత వాటిని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులుకు ఇచ్చి గాలి జనార్దన్ రెడ్డిని బయటకు తీసుకురావాలని ఆయన న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు. అయితే జైళ్ల శాఖ నియమాల ప్రకారం న్యాయవాదులు అనుకున్న సమయానికి పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు చేరుకునే అవకాశం చాల తక్కువగా ఉంది. సమయం మించిపోతే గురువారం ఉదయం గాలి జనార్దన్ రెడ్డి జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉందని ఆయన న్యాయవాది చంద్ర శేఖర్ అంటున్నారు.