నకిలీ పర్మిట్లతో గాలి అక్రమ మైనింగ్ ఆపరేషన్స్
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) కేసులో ఆయన ప్రస్తుతం హైదరాబాదులోని చంచల్గుడా జైలులో ఉన్నారు. స్వస్తిక్ నాగరాజు, కారంపూడి మహేష్, ఇతర గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు ఆంధ్రప్రదేశ్ మైన్స్ జియాలజీశాఖ, అటవీ నకిలీ పర్మిట్లతో పాటు ఇన్వాయిసెస్ సమర్పించి, 2009 జనవరి 1వ తేదీ నుంచి 2010 మే 31వ తేదీ వరకు అక్రమంగా ముడి ఇనుమును బేలెకేరి పోర్టుకు తరలించినట్లు సిబిఐ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో ఆరోపించింది.
షాఫియా మినరల్స్, మంజునాథేశ్వర మినరల్స్ వంటి సంస్థలను ఉద్యోగులు, బంధువుల పేర్ల మీద సృష్టించి ఇన్వాయిస్లు అచ్చు వేసి నకిలీ పర్మిట్లతో పాటు ముడి ఇనుమును రవాణా చేసే వాహనాలకు ఇచ్చేవారని సిబిఐ ఆరోపించింది. గాలి జనార్దన్ రెడ్డి, ఆయన వ్యక్తిగత సహాయకుడు అలీ ఖాన్ అటువంటి సంస్థలను సృష్టించినట్లు, ఆ సంస్థల ద్వారా భారీగా డబ్బులను జనార్దన్ రెడ్డికి తరలించినట్లు సిబిఐ ఆరోపించింది.
అలీ ఖాన్ ఇతర మైన్స్ యజమానులను బెదిరించి వాటిని తీసుకునేవాడని, అక్రమ తవ్వకాల గురించి గానీ రవాణా గురించి గానీ ప్రశ్నించినప్పుడు అటవీ, డిఎంజి అధికారులను, పోలీసులను కూడా బెదిరించేవాడని సిబిఐ ఆరోపించింది. జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ వ్యవహారాలకు పాల్పడడమే కాకుండా ఈ వ్యాపారంలో ఉన్న ఇతర వ్యక్తుల నుంచి డబ్బులు గుంజేవాడని సిబిఐ ఆరోపించింది.