రైతు పథకం మోడీకి గేమ్ఛేంజర్గా నిలుస్తుందా..? కోటిమంది రైతుల అకౌంట్లలోకి నగదు బదిలీ
తెలంగాణలో ఎలాగైతే సీఎం కేసీఆర్ రైతు సంక్షేమం కోసం రైతు బంధు పథకం పెట్టి తిరిగి అధికారంలోకి వచ్చారో అలాంటి రైతు పథకాన్నే దేశం యావత్తు అమలు చేస్తోంది మోడీ సర్కార్. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ఐదెకరాల లోపు భూమి ఉంటే వారికి రూ. 6వేలు విడతలవారీగా నేరుగా ఖాతాలోకి వేస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 54.7 లక్షల చిన్న సన్నకారు రైతులకు లబ్ధి చేకూరనుంది. వీరందరికీ కేంద్ర ప్రభుత్వం తొలివిడతగా రూ. 2వేలు తమ ఖాతాలోకి బదిలీ చేయనుంది. ఫిబ్రవరి 24వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ చేతులు మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది.
కేంద్రం చెబుతున్న లెక్కల్లో కాస్త తేడా కనిపిస్తోంది
కేంద్రం చెబుతున్నట్లుగా చిన్న సన్నకారు రైతుల సంఖ్య 1 కోటికి పైగా ఉండొచ్చని అధికారులు వెల్లడిస్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారం పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టంవద్ద ఉంది. ఇప్పటి వరకు 2.2 కోట్ల చిన్న సన్నకారు రైతుల నుంచి సమాచారం సేకరించి వాటిని ధృవీకరించామని అధికారులు వెల్లడించారు. తాము సమాచారం సేకరణకు వెళ్లినప్పుడు ఆయా రాష్ట్రాల్లోని రైతులు తమకు సహకరించినట్లు వెల్లడించారు.
తిరస్కరణకు గురైన 43 లక్షల దరఖాస్తులు
ఇక బడ్జెట్ సందర్భంగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ రైతు సంక్షేమం కోసం మధ్యంతర బడ్జెట్లో ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద చిన్న సన్నకారు రైతులకు ఏడాదికి రూ. 6వేలు ఇస్తామని ప్రకటించారు. ఇది 2018 డిసెంబరు 1 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. మార్చి 31కల్లా తొలి వాయిదాగా రూ. 2వేలు చెల్లిస్తామని చెప్పారు. అయితే ఇప్పటి వరకు తాము కూడా అర్హులమంటూ పెట్టుకున్న 43 లక్షల దరఖాస్తులను కేంద్రం తిరస్కరించింది. ఆధార్తో అనుసంధానం అవడం వల్ల కొన్ని అప్లికేషన్లను తిరస్కరించినట్లు కేంద్రం వెల్లడించింది. రెండో పద్దతి ద్వారా మరికొందరిని తిరస్కరించడం జరిగింది. ఇక అసలైన అర్హులు ఎవరో నిర్దారించేందుకు రెండో పద్ధతిని కూడా కేంద్రం వినియోగించి ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద వచ్చే అర్హులను మాత్రమే గుర్తించి వారికి డబ్బులు ఖాతాలో వేయనుంది.
తెలంగాణలో 4.21 లక్షల మంది రైతుల దరఖాస్తులు తిరస్కరణ
ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, అస్సోం, హర్యానా రాష్ట్రాలు తమ రాష్ట్రంలోని రైతులకు సంబంధించిన సమాచారం పొందుపర్చింది. పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, కర్నాటక రాష్ట్రాలు అంటే ఎక్కడైతే బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలు ఎలాంటి రైతు సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. మధ్యప్రదేశ్ 4,892 మంది రైతులకు సంబంధించి సమాచారం పొందుపర్చగా... ఆ దరఖాస్తులన్నీ తిరస్కరణకు గురయ్యాయి. ఛత్తీస్గఢ్ 83 మంది రైతులకు సంబంధించి సమాచారం పొందుపర్చింది. పెద్ద ఎత్తున రైతుల సమాచారం లేదా వారి దరఖాస్తులను తిరస్కరించడం వెనక చాలా కారణాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఉదాహరణకు తెలంగాణ రైతు బంధు పథకాన్ని విజయవంతంగా అమలు చేసింది. కానీ కేంద్రం మాత్రం అత్యధికంగా 4.21 లక్షల రైతుల సమాచారం లేదా దరఖాస్తులను తిరస్కరించింది. ఇప్పటి వరకు కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం 15 లక్షల రైతులకు సంబంధించిన డేటాను సబ్మిట్ చేసింది.
సమాచారం లేకపోతే డబ్బులు ఎవరికిస్తారు..?
"ఒకవేళ రైతులకు సంబంధించిన సమాచారం కేంద్ర ప్రభుత్వం వద్ద లేకపోతే ఎవరికి డబ్బులు ఇవ్వాలనేది ఎలా నిర్ణయిస్తారు..? ఎవరికైనా ఇవ్వొచ్చు.. రైతులే అయి ఉండాలని లేదు. అది రైతు సమస్యలను పరిష్కరించదు " అని ఆర్థికవేత్త అశోక్ గులాటీ అన్నారు. కేంద్రప్రభుత్వం ఇప్పటికే చాలా ఆలస్యం చేసిందని చెప్పిన అశోక్ గులాటీ... రెండేళ్ల క్రితమే రైతులకు సంబంధించిన భూమి వివరాలు, ఆధార్ అనుసంధానం, జన్ధన్ బ్యాంకు అకౌంట్లు పై సమాచారం తీసుకోవాల్సి ఉన్నిందని చెప్పారు. ఇప్పుడైతే డబ్బులు అర్హులైన రైతులకు చేరుతాయనే నమ్మకం తనకు కలగడం లేదని వెల్లడించారు.