మహాత్ముడి ఆత్మకు క్షోభ: గాంధీ త్యాగాలను చెరిపేసే కుట్ర: ఆర్ఎస్ఎస్ చేతుల్లో దేశం: సోనియా ఆందోళన
న్యూఢిల్లీ: దేశంలో అవాంఛనీయ వాతావరణం నెలకొందని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. మహాత్ముడి త్యాగాలు, జ్ఞాపకాలను శాశ్వతంగా తుడిచేసే కుట్ర సాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశాన్ని కాషాయమయం చేయడానికి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చేతుల్లో పెట్టడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పారు. అయిదేళ్ల కాలంలో దేశంలో నెలకొన్న వాతవారణం, చోటు చేసుకున్న పరిణామాలు మహాత్ముడి ఆత్మను తీవ్రంగా క్షోభకు గురి చేస్తుంటాయని ఆమె పేర్కొన్నారు.
Glimpses from the #GandhiSandeshYatra led by Shri @RahulGandhi
— Congress (@INCIndia) October 2, 2019
The Padyatra aims to redeem Gandhiji, Gandhism and Gandhi's India in our country today. pic.twitter.com/6xsx7NwlQO
జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని బుధవారం దేశ రాజధానిలోని రాజ్ ఘాట్ ఆయన సమాధికి ఘన నివాళి అర్పించారు. సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. గాంధీ సందేశ్ యాత్రను ప్రారంభించారు. అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. పరోక్షంగా భారతీయ జనతాపార్టీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను ఏకి పారేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి చురకలు అంటించారు. మహాత్ముడు కలలు గన్న భారత్ ఇది కాదని అన్నారు. సర్వమత సమానత్వం, సమ న్యాయం కోసం మహాత్మా గాంధీ తన ప్రాణాలను సైతం లెక్క చేయలేదని, ప్రస్తుతం దేశంలో అలాంటి పరిస్థితులు కనుమరుగు అయ్యాయని చెప్పారు.
అయిదేళ్లుగా దేశంలో నెలకొన్న పరిస్థితులు గాంధీ ఆత్మను బాధపెడుతుంటాయని అన్నారు. కొంతమంది తాము మహాత్మా గాంధీని మించిన వాళ్లమని భ్రమ పడుతున్నారని పరోక్షంగా నరేంద్ర మోడీని ఉద్దేశించి చెప్పారు. అలాంటి వారు చరిత్రలో నిలిచిపోవడం అసాధ్యమని సోనియాగాంధీ అన్నారు. భారత్ అంటే మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీ అంటే భారత్.. దీన్నెవరూ చెరిపేయలేరు.. అని చెప్పారు. మహాత్ముడి త్యాగాలు, జ్ఞాపకాలను చెరిపి వేయడానికి చేస్తోన్న కుట్ర ఎక్కువ కాలం సాగదని హెచ్చరించారు.
గాంధీజీ పేరును స్మరిస్తూ.. ఆయనను భారత్ నుంచి వేరు చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారు గతంలోనూ ఉండేవారని అన్నారు. గాంధీ త్యాగాలను చెరిపేయడానికి సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగిస్తున్నారని చెప్పారు. తమను తాము అత్యంత శక్తిమంతులుగా చిత్రీకరించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అలాంటి నాయకులకు గాంధీజీ త్యాగాలు అర్థం కావని చెప్పారు. తాము అనుసరించే ఏకపక్ష భావాలను ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారని, వాటిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని సోనియాగాంధీ అన్నారు.