పార్లమెంటు ప్రాంగణంలో గాంధీ విగ్రహం తొలగింపు- ఎందుకో తెలుసా ?
భారత పార్లమెంటు ప్రాంగణంలో అడుగుపెట్టగానే మౌనంగా కూర్చున్న 16 అడుగులు ఎత్తైన జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం దర్శనమిస్తుంటుంది. ఎన్నో భావాలకు ప్రతిరూపంగా ప్రజలు, రాజకీయ నాయకులు, సందర్శకులు దాన్ని భావిస్తుంటారు. దీన్ని ప్రస్తుతం వేరే ప్రాంతానికి మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలు కూడా బలంగానే ఉన్నాయి.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కొత్త పార్లమెంటు భవన నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. నిర్మాణ కాంట్రాక్టు తీసుకున్న టాటా కన్స్ట్రక్షన్స్ డిసెంబర్లో కొత్త భవనం పనులు ప్రారంభించనుంది. ఇందుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా గేట్ నంబర్ వన్ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహాన్ని తాత్కాలికంగా వేరే చోటకు మార్చాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం కొత్త పార్లమెంటు నిర్మాణం వ్యవహారాల్ని పర్యవేక్షిస్తున్న కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ, కేంద్ర ప్రజాపనుల శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి.
ప్రస్తుతం నిర్మించాలని భావిస్తున్న కొత్త పార్లమెంటు భవనం నిర్మాణం సందర్భంగా ఎలాంటి శబ్దాలు బయటికి రాకుండా సౌండ్ ప్రూఫ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా కొత్త పార్లమెంటు నిర్మాణ ప్రాంగణం చుట్టూ ఓ భారీ గోడను కూడా నిర్మిస్తున్నారు. ఇది గాంధీ విగ్రహం ఉన్న ప్రాంతం నుంచి వెళ్లాల్సి ఉంది. దీంతో గాంధీ విగ్రహాన్ని తాత్కాలికంగా వేరే చోటుకు తరలించాలని నిర్ణయించారు. కొత్త భవనం నిర్మాణం పూర్తి కాగానే ఎలాగో అందులోకి విగ్రహాన్ని మార్చాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఇది తాత్కాలిక తరలింపేనని కేంద్రం చెబుతోంది. కొత్త భవనం ప్రారంభోత్సవ సమయానికి ఈ విగ్రహాన్ని ఎక్కడ ప్రతిష్టించాలో నిర్ణయిస్తామని కేంద్రం తెలిపింది.