గాంధీజీ ఓ బ్రిటిష్ ఏజెంట్: మార్కండేయ ఖట్జూ
ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్ జస్టిస్ మార్కండేయ ఖట్జూ, మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశానికి హాని చేసిన జాతిపిత మహత్మా గాంధీ ఓ బ్రిటిష్ ఏజెంట్ అని తన బ్లాగులో వ్యాఖ్యానించారు.
'వాట్ ఈజ్ ఇండియా' పేరుతో రాసిన ఓ అర్టికల్లో గాంధీజీపై కట్జూ తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు చేశారు. "ఇలా అనడం వల్ల నాపై వ్యక్తిగత దూషణలు వస్తాయని నాకు తెలుసు. కానీ ప్రజాదరణ ఆశించని ఓ వ్యక్తిని కాదు కాబట్టి పెద్ద విషయం కాదు. ఇలాంటి వాటి వల్ల మొదట్లో నన్ను అప్రజాదరణకు గురిచేస్తాయి. దాంతో నేను అవమానాలు పడాల్సి ఉంటుంది, పలువురు నా వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేస్తారు. నా దేశం ఆసక్తి మేరకు కొన్ని విషయాలు చెబుతున్నాను" అని కట్జూ ముందుగానే పేర్కొన్నారు.
గాంధీని బ్రిటిష్ ఏజెంట్ అనడానికి గల కారణాలను కూడా వివరించారు. భారతదేశంలో అద్భుతమైన వైవిధ్యం ఉందని, కులాలు, మతాలు, జాతులు, భాషలు ఉన్నాయని చెప్పారు. విభజించు పాలించు అనేది బ్రిటిష్ విధానం అందరికీ తెలుసునని, తర్వాత కాలంలో అదే బ్రిటిష్ విధానాన్ని మహాత్మా గాంధీ మరింతగా విస్తరించారని ఆరోపించారు.