ఢిల్లీలో గ్యాంగ్ రేప్ బాదితురాలి జుట్టు కత్తిరించి, చెప్పుల దండలేసి ఊరేగింపు; స్పందించిన కేజ్రీవాల్
దేశ రాజధాని ఢిల్లీలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ సామూహిక అత్యాచార బాధితురాలిని నగరం నడిబొడ్డున పట్టపగలు జుట్టు కత్తిరించి, చెప్పుల దండలు వేసి అత్యంత దారుణంగా హింసించిన ఘటన చోటు చేసుకుంది. కొందరు మహిళలు గ్యాంగ్ రేప్ బాధితురాలు అయిన మహిళను విపరీతంగా కొట్టి, జుట్టు కత్తిరించి, చెప్పుల దండతో ఊరేగించిన వీడియో వైరల్ కావడంతో, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ సంఘటన "చాలా సిగ్గుచేటు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళ జుట్టు కత్తిరించి, నల్లరంగు ముఖానికి పూసి, చెప్పుల దండలు వేసి చిత్రహింస
అసలు ఘటనకు సంబంధించిన విషయానికి వస్తే గణతంత్ర దినోత్సవం రోజున వివేక్ విహార్ ప్రాంతంలో మహిళను కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం చేసి, దాడి చేసిన కేసులో నలుగురు నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో నిందితుడితో మహిళకు ఉన్న వ్యక్తిగత శత్రుత్వమే ఈ ఘటనకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇదిలా ఉంటే కస్తూరిబాయ్ నగర్ లో అత్యాచారానికి గురైన 20 ఏళ్ల యువతిని కొందరు మహిళలు చిత్రహింసలకు గురి చేశారు. అత్యాచార బాధితురాలిగా చెబుతున్న మహిళ జుట్టు కత్తిరించి, నల్లరంగు ముఖానికి పూసి, చెప్పుల దండలు వేసి మహిళలు ఆమెను వీధుల్లో తిప్పారు. బాధితురాలికి వివాహమై ఒక పాప కూడా ఉంది.
ఘటన వీడియో పోస్ట్ చేసిన ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్ స్వాతి మలివాల్
ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్ స్వాతి మలివాల్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అక్రమంగా మద్యం అమ్మేవాళ్ళు యువతిపై గ్యాంగ్ రేప్ చేసినట్టుగా ఆమె ఆరోపించారు. ఇక బాధితురాలిని కొట్టుకుంటూ ఊరేగించిన నిందితుల తాలూకు మహిళలను కూడా అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. సభ్య సమాజంలో ఇలాంటి దారుణ ఘటనలు హేయమని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక స్వాతి మలివాల్ పోస్ట్ ను రీ పోస్ట్ చేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వాళ్లకి ఎంత ధైర్యం అంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.
ఇంత ధైర్యమా .. ట్వీట్ చేసిన కేజ్రీవాల్
నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని హోంమంత్రి అమిత్ షా, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ను ఆయన కోరారు. ట్విటర్లో, సిఎం కేజ్రీవాల్ "ఇది చాలా సిగ్గుచేటు. నేరస్థులకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది? కఠినంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించాలని కేంద్ర హోం మంత్రి మరియు లెఫ్టినెంట్ గవర్నర్ను కోరుతున్నాను అంటూ పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిస్థితిపై చర్య తీసుకోవాలని, ఢిల్లీ వాసులు ఇలాంటి క్రూరమైన నేరాలను మరియు నేరస్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరు అని అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసారు.
Recommended Video
కఠిన చర్యలు తీసుకోవాలన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
మహిళపై అమానుషంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ఇక ఈ వ్యవహారంపై స్పందించిన పోలీసులు బాధితురాలి పై ఉన్న వ్యక్తిగత కక్షతోనే మహిళలు యువతి పై దాడి చేసినట్లుగా ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ సత్య సుందరం స్పష్టం చేశారు . యువతిపై అత్యాచారానికి పాల్పడిన వారిని బుధవారం రోజు అరెస్ట్ చేశామని ఆయన వెల్లడించారు. దాడి ఘటనపై కేసు నమోదు చేసి తాము విచారణ చేస్తున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు.