సెంట్రల్ జైలులో గ్యాంగ్ వార్: కాల్పులు జరిపిన ఖైదీలు
చండీఘడ్: పంజాబ్ లోని జైలులో గ్యాంగ్ వార్ జరిగింది. ఈ దాడిలో కరుడుకట్టిన నేరస్తుడితో సహా ఇద్దరికి తీవ్రగాయాలైనాయి. పంజాబ్ లోని భటిండా సెంట్రల్ జైల్ లో కాల్పులు జరగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. గురువారం ఉదయం ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనతో సాటి ఖైదీలు హడలి పోతున్నారు.
గురువారం ఉదయం భటిండా సెంట్రల్ జైలులో అల్పాహారం తినడానికి ఖైదీలను వదిలి పెట్టారు. ఆ సమయంలో ఖైదీల మద్య గ్యాంగ్ వార్ జరిగింది. పరస్పరం దాడులు చేసుకున్నారు. అదే సమయంలో జైలు ఆవరణంలో కాల్పులు జరిగాయి.
ఈ కాల్పులలో కరుడుగట్టిన నేరస్తుడు గుర్జిత్ సింగ్ కు తీవ్రగాయాలైనాయి. జైలు ఆవరణంలోని ఆసుపత్రిలో అతనికి ప్రథమ చికిత్స అందించి తరువాత వేరే ఆసుపత్రికి తరలించారు. ఇతనితో పాటు మరో ఖైదీకి తీవ్రగాయాలైనాయి. విషయం తెలుసుకున్న జైలు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అక్రమ ఆయుధాల కేసులో అరెస్టు అయిన కుల్బీర్ సింగ్ నౌరానా భటిండా సెంట్రల్ జైలులో అండర్ ట్రయిల్ ఖైదీగా ఉన్నాడు. నౌరానా నే గురువారం ఉదయం కాల్పులు జరిపి ఉంటాడని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో కుల్బీర్ సింగ్ జైలు లోపల వివిద భంగిమలలో నిలబడి సెల్ పోన్ తో ఫోటోలు తీసుకుని ఫేస్ బుక్ లో పెట్టాడు. ఆ ఫోటోలు చూసిన పోలీసులు హడలిపోయారు.