రేప్లు తగ్గాలంటే.. వాలెంటైన్స్ డే, కిస్ ఆఫ్ లవ్ను నిషేధించాలి: నిర్భయ డిఫెన్స్ లాయర్
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో డిఫెన్స్ న్యాయవాది ఏపి సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. భారత్లో లైంగిక దాడులను నివారించాలంటే వాలంటైన్స్ డే ఉత్సవాలు, కిస్ ఆఫ్ లవ్ ప్రచారంపై నిషేధం విధించాలని వ్యాఖ్యానించారు.
సామూహిక అత్యాచార ఘటనపై బిబిసి ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి బార్కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) షోకాజ్ నోటీసులు అందుకున్నా.. ఏపి సింగ్ తన వైఖరి మార్చుకోలేదు. భారతీయులు పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా అనుకరించడం సరికాదని అన్నారు.
ఇటీవల విడుదలైన నిర్భయ డ్యాకుమెంటరీలోనూ ఈ న్యాయవాది వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కిస్స్ ఆఫ్ లవ్.. ప్రేమికుల రోజు(వ్యాలెంటైన్స్ డే) తదితర కార్యక్రమాలను నిషేధించాలి. అప్పుడే దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న అత్యాచారాలను అరికట్టవచ్చు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం భారతీయ సంప్రదాయం కాదు' అని న్యాయవాది పేర్కొన్నారు.
ఇది ఇలా ఉండగా.. వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రసుగా ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ.. నిర్భయ కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న నేరస్తుడు ముకేష్ సింగ్ కేసు వాదిస్తున్న డిఫెన్స్ లాయర్ ఎంఎల్ శర్మపై తీవ్రంగా స్పందించారు. న్యాయవాది శర్మ లైంగిక దాడులకు పాల్పడేవారికన్నా సమాజానికి ఎంతో ప్రమాదకారి అని పేర్కొన్నారు.