గర్ల్ను ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్, బలవంతంగా మతమార్పిడి!
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్లో దారుణం జరిగింది. ఓ ఇరవై ఏళ్ల యువతిని ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారం చేయడమే కాకుండా.. ఆమెను బలవంతంగా మతమార్పిడి చేసిన సంఘటన వెలుగు చూసింది. దీంతో మీరట్ జిల్లాలోని ఖర్ ఖౌదా, అట్రాడా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
ఒక సామాజిక వర్గానికి చెందిన వారి ఇళ్ల పైన మరో సామాజిక వర్గానికి చెందిన ప్రజలు రాళ్లు రువ్విన సంఘటనలు ఆదివారం రాత్రి జరిగాయి. ఈ పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ఉద్రిక్తంగా ఉన్న ప్రాంతాల్లో పోలీసు దళాలను మోహరించారు. ఖర్ ఖౌదా గ్రామపెద్దతో పాటు మత పెద్ద, ఆయన భార్య, కుమార్తెల ప్రోద్బలంతోనే ఈ ఘోరం జరిగినట్లు బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గ్రామ పెద్ద, మరో అయిదుగురు కలిసి జూలై 23న తన కుమార్తెను అపహరించుకు వెళ్లి ఓ చోట బంధించి ఆమె పైన సామూహిక అత్యాచారం చేశారన్నారు. ఆ తర్వాత ఆమె మతాన్ని మార్చుకున్నట్లు కొన్ని పత్రాల పైన సంతకాలు పెట్టించుకున్నారన్నారు.
జూలై 30న బాధితురాలు తప్పించుకొని వచ్చి తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పింది. వైద్య పరీక్షల్లో ఆమె పైన అత్యాచారం జరిగినట్లు రుజువైంది. బాధితురాలి పొట్ట పైన కత్తిగాట్లు కనిపించాయి. ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేశారు. మత పెద్ద, ఆయన భార్య, కుమార్తెలను అరెస్టు చేశారు.