రైల్లో అబూ సలేం పెళ్లి: వధువు ముంబై అమ్మాయి
ముంబై: గ్యాంగస్టర్ అబూ సలేం ముంబైకి చెందిన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. రైలులో ఈ వివాహం జరిగినట్లు ఆ వార్తాకథనాలు చెబుతున్నాయి. జనవరి 8వ తేదీన ఈ రైలు వివాహం జరిగినట్లు తెలుస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఈ మేరకు వార్తాకథనం వచ్చింది.
కోర్టులో హాజరు పరచడానికి రైలులో తీసుకుని వెళ్తుండగా అబూ సలేం వివాహం జరిగినట్లు చెబుతున్నారు. ముంబైకి చెందిన కాజీ ఫోన్లో నిఖా చేసినట్లు తెలుస్తోంది. సాక్షులుగా అబూ సలేం మేనల్లుడు రషీద్ అన్సారీ, ముంబై, లక్నోలకు చెందిన పోలీసులు ఉన్నట్లు చెబుతున్నారు.
ఈ విషయంపై ముంబై మిర్రర్ పత్రిక అన్సారీని సంప్రదిస్తే అబూ సలేం వ్యక్తిగత విషయా నుంచి తనను దూరంగా ఉంచాలని, న్యాయపరమైన విషయాలేతే మాత్రమే తాను మాట్లాడుతానని చెప్పాడని టైమ్స్ ఇండియా రాసింది.
అబూ సలేం వివాహం చేసుకున్న 27 ఏళ్ల మహిళ తరుచుగా టాడా కోర్టు వద్ద కనిపించేదట. అయితే, ఆమె గురించి చాలా తక్కువ తెలుసునని టైమ్స్ ఇండియా వ్యాఖ్యానించింది. ముంబైలోని వ్యాపార లావాదేవీలను ఆమె చూస్తుందని చెబుతున్నారు.
అబూ సలేం వివాహం గురించి పోలీసులు నోరు విప్పడానికి ఇష్టపడడం లేదు. లక్నోకు అబూ సలేంను తీసుకుని వెళ్లి, తిరిగి సురక్షితంగా తీసుకురావడమే ఎస్కార్టు పని అని వారంటున్నారు. రైలులో ఏం జరిగింది, ఎవరెవరు మాట్లాడుకున్నారనే విషయాలు పోలీసులకు అవసరం లేదని అంటున్నారట.