హై సెక్యూరిటీ: ఉగ్రవాది కసబ్ ‘సెల్’లోనే చోటా రాజన్!
ముంబై/బాలి: ముంబై దాడుల ఉగ్రవాది అజ్మల్ కసబ్ను బంధించిన హై సెక్యూరిటీ సెల్లోనే ఇటీవల అరెస్ట్ అయిన గ్యాంగ్స్టర్ చోటా రాజన్ను పెట్టే అవకాశాలున్నాయి. ఇండోనేషియాలోని బాలిలో ఇంటర్పోల్కు చిక్కిన చోటా రాజన్ ప్రస్తుతం అక్కడి పోలీసుల ఆధీనంలో ఉన్నాడు. విచారణ కోసం అతడ్ని త్వరలో ముంబై తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ముంబై పోలీస్ హెడ్క్వార్టర్స్లోని క్రైం బ్రాంచ్ లాకప్లో చోటాను బంధించాలనుకుంటున్నారు. కరుడుగట్టిన నేరస్తులను బంధించేందుకు అక్కడ ఇలాంటి లాకప్లను నిర్మించారు. దాని చుట్టూ ఎప్పుడూ ప్రత్యేక దళాలు, క్విక్ రెస్పాన్స్ టీమ్లు గస్తీ కాస్తుంటాయి. 2008లో కసబ్ పట్టుబడిన వెంటనే అతన్ని ఇక్కడి సెల్లోనే ఉంచారు.
ఒకవేళ చోటా రాజన్ను భారత్కు తరలిస్తే.. అతని చుట్టూ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని ముంబై పోలీసులు భావిస్తున్నారు. మాఫియా డాన్పై ప్రత్యర్థులు దాడులు చేసే అవకాశం కూడా ఉంది.
కాగా, చోటా రాజన్ విచారణను కూడా వీడియో రికార్డింగ్ చేయాలనుకుంటున్నారు. తనను చంపేందుకు బెదిరింపులు వస్తున్నా రాజన్ మాత్రం భారత్ వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. తనకు ఎలాంటి భయం లేదని, భారత్ వచ్చేందుకు తనకు ఇష్టమేనని చోటా రాజన్ తెలిపినట్లు సమాచారం.
55 ఏళ్ల చోటా డాన్ గత రెండు దశాబ్ధాలుగా పరారీలో ఉన్నాడు. అతనిపై మొత్తం 71 కేసులు ఉన్నాయి. ఇండోనేషియాలోని బాలీలో పట్టబడ్డ రాజన్.. జింబాబ్వే వెళ్లాలనుకుంటున్నట్లు మొదట్లో అక్కడి పోలీసులకు చెప్పాడు. అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నుంచి ప్రమాదం ఉన్నట్లు అతను భయాన్ని వ్యక్తం చేశాడు. అయితే, తాజాగా తనకు ఎవరితో భయంతో లేదని, ఇండియాకు వచ్చేందుకు తనకేలాంటి ఇబ్బంది లేదని చెప్పాడు.