నకిలీ పాస్పోర్ట్ ఇచ్చారు, నేను దేశభక్తుడిని: చోటా రాజన్
ముంబై: ఉగ్రవాదం పైన పోరాడేందుకే తాను తన భారత పాస్పోర్టు ఉపయోగించానే తప్ప దానిని ఎన్నడూ దుర్వినియోగం చేయలేదని, తాను అసలైన దేశభక్తుడిని అని గ్యాంగ్ స్టర్ చోటా రాజన్ కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పాడు.
చోటా రాజన్ గ్యాంగ్ స్టర్గా పేరుమోసి, తప్పించుకుని విదేశాలలో 27 ఏళ్ల పాటు తిరిగాడు. అతను ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో మంగళవారం హాజరై వాంగ్మూలం ఇచ్చాడు.
భారత నిఘా సంస్థలు ఇచ్చిన నకిలీ పాస్పోర్టుతోనే ఆస్ట్రేలియా వెళ్లి పదేళ్లకు పైగా రహస్యంగా ఉండి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కీలక సమాచారమిస్తూ భారత ప్రభుత్వానికి సహకరించానని చెప్పాడు. దావూద్ను పట్టుకోడానికి, ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు కృషి చేస్తున్న నిఘా సంస్థలకు సాయం చేశానని చెప్పాడు.
అమాయక ప్రజలను చంపుతున్న, దేశ వ్యతిరేకులకు వ్యతిరేకంగా పోరాటంలో తాను పరోక్షంగా తన పాత్ర ఉన్నట్లు అభిప్రాయపడ్డాడు. తనకు ఎవరు సహకరించారో, తాను ఎవరికి సహకరించానో చెప్పలేనని తెలిపాడు.