పట్టపగలు కాల్పుల మోత: గ్యాంగ్ స్టర్ హతం: సెటిల్ మెంట్లతో రూ.600 కోట్లు
బెంగళూరు: బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. పట్టపగలు రెండు గ్యాంగ్ ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సినీ ఫక్కీలో పరస్పరం కాల్పులు జరుపుకొన్నారు. ఈ కాల్పుల్లో లక్ష్మణ అనే గ్యాంగ్ స్టర్ హతమయ్యాడు. బెదిరింపులు, సెటిల్ మెంట్ల ద్వారా లక్ష్మణ ఏకంగా 600 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులను కూడబెట్టినట్టు తెలుస్తోంది. జైలు జీవితాన్ని గడుపుతున్న లక్ష్మణ.. సరిగ్గా రెండు వారాల కిందటే బెయిల్ పై విడుదలయ్యాడు. అతనిపై 25 క్రిమినల్ కేసులు ఉన్నాయి.
బెంగళూరులోని మహాలక్ష్మి లే అవుట్ లో అతను నివసిస్తున్నాడు. తన స్నేహితులను కలుసుకుని సొంతంగా కారును నడుపుకొంటూ ఇంటికి వెళ్తుండగా.. మైసూర్ శాండల్ సబ్బుల తయారీ ఫ్యాక్టరీ సమీపంలో అయిదుమంది రౌడీలు అతణ్ని అడ్డగించారు. వారిని గమనించిన లక్ష్మణ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కారును మహాలక్ష్మి లే అవుట్ వైపు పరుగులు పెట్టించాడు. అయినప్పటికీ.. వారు వదల్లేదు. మరో కారులో వారు లక్ష్మణను వెంబడించారు.
కారు మహాలక్ష్మి లే అవుట్ సమీపంలోకి రాగానే.. మరోసారి కారును అడ్డగించారు. దీనితో కిందికి దిగి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. కారంపొడిని అతనిపై చల్లారు. మండుతున్న కళ్లతో రోడ్డుపై కుప్పకూలిన లక్ష్మణపై రౌడీషీటర్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో లక్ష్మణ సంఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో వందలాది వాహనాలు రాకపోకలు సాగించే రద్దీ రోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకుంది.
సమాచారం అందుకున్న వెంటనే మహాలక్ష్మి లే అవుట్ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. నడిరోడ్డుపై రక్తమోడుతూ పడి ఉన్న లక్ష్మణను సమీపంలోని ఎం ఎస్ రామయ్య ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ కాల్పుల ఘటన మొత్తం సమీప అపార్ట్ మెంట్ లో అమర్చిన సీసీ కెమెరాలో రికార్డయ్యింది. పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కర్ణాటకలోని తుమకూరు జిల్లా కుణిగల్ తాలూకా హులియూర్ దుర్గె గ్రామానికి చెందిన లక్ష్మణ 20 ఏళ్ల కిందట తన సోదరుడు రాముతో కలిసి బెంగళూరులో స్థిరపడ్డారు. అప్పటి నుంచి నేరాలకు పాల్పడుతూ వచ్చారు. రియల్టర్లను బెదిరించడం, భూ వివాదాల్లో తలదూర్చి, సెటిల్ మెంట్లు చేయడం ద్వారా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ఆస్తులను కూడబెట్టుకున్నారు. సెటిల్ మెంట్ల ద్వారా వచ్చిన భూములను అధిక రేట్లకు రియల్టర్లకు విక్రయించే వాడు. ఇందులో ఒక్క లక్ష్మణ పేరు మీదే సుమారు 600 కోట్ల రూపాయల మేర స్థిర, చరాస్తులు ఉన్నట్లు పోలీసులు చెప్పారు.
బెంగళూరులోని అనేక పోలీస్ స్టేషన్లలో లక్ష్మణపై సుమారు 25కు పైగా కేసులు నమోదయ్యాయి. తన అనుచరులతో కలిసి గ్యాంగ్ వార్ కు తెగబడేవాడు. మాగడి రోడ్, కామాక్షిపాళ్య పోలీసులు అతనిపై రౌడీషీట్ ను తెరిచారు. 2013లో ప్రత్యర్థి గ్యాంగ్ కు చెందిన రౌడీషీటర్ టీసీ రవిని హత్య చేయడానికి ప్రయత్నించిన కేసులో పోలీసులు రామ్ ను అరెస్టు చేశారు.