హైప్రొఫైల్ మర్డర్: గ్యాంగ్స్టర్ కాల్చివేత - బంద్కు పిలుపు
జైపూర్: కొద్దిరోజుల కిందటే పంజాబ్లో ప్రముఖ గాయకుడు, కాంగ్రెస్ నాయకుడు సిద్ధు మూసేవాలా దారుణహత్యకు గురయ్యారు. రౌడీషీటర్లు ఆయనను తుపాకులను కాల్చి చంపారు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పనేనంటూ అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ హత్య వెనుక అతనిదే మాస్టర్ మైండ్ అంటూ పోలీసులు నిర్ధారించారు. అతని గ్యాంగ్ మొత్తాన్నీ ఏరివేసే పనిలో ఉన్నారు పంజాబ్ పోలీసులు.
తెలంగాణలో వ్యాపారం- ఏపీలో రాజకీయం: ఒకే సినిమాకు రెండు టైటిళ్లు..!!
ఇప్పుడు తాజాగా రాజస్థాన్ అలాంటి హత్యోదంతమే చోటు చేసుకుంది. హైప్రొఫైల్ గ్యాంగ్స్టర్ రాజు థెట్ హత్యకు గురయ్యాడు. అతని ఇంటి వద్దే బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు దుండగులు. ఈ హత్యలో కూడా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం ఉంది. ఈ హత్యను తానే చేసినట్లు బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన హిస్టరీ రౌడీ షీటర్ రోహిత్ గొదారా ప్రకటించుకున్నాడు. ఇది తన పనేనని వివరించాడు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశాడు.
తన తమ్ముళ్లు ఆనంద్ పల్, బల్బీర్ బనుద హత్యలకు ప్రతీకారాన్ని తీర్చుకున్నట్లు చెప్పాడు. రాజస్థాన్లోని సికార్లో ఈ ఉదయం ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. సికార్ ఉద్యోగ్నగర్ ప్రాంతంలో రాజు థెట్ను కాల్చి చంపాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
బ్లూ జీన్స్ ధరించిన రాజు థెట్ ఇంటి వద్ద నిల్చుని ఇద్దరు వ్యక్తులతో మాట్లాడుతుండటం ఈ వీడియోల్లో రికార్డయింది. అదే సమయంలో మరో ఇద్దరు వక్తులు అక్కడికి రావడం, ఓ ట్రాక్టర్ను అడ్డుగా పెట్టి- రాజు థెట్పై కాల్పులు జరపడం ఇందులో కనిపించింది. మూడు రౌండ్ల పాటు కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు. బుల్లెట్ గాయాలతో రాజు థెట్ సంఘటన స్థలంలోనే మరణించాడు. ఆ ప్రదేశం మొత్తం రక్తసిక్తమైంది.
ఈ హత్య తరువాత సికార్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజు థెట్ మృతదేహాన్ని తీసుకోవడానికి నిరాకరించారు కుటుంబ సభ్యులు. హంతకుడిని తక్షణమే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు తేజా సేన బంద్కు పిలుపునిచ్చింది. ఆ సంస్థ ప్రతినిధులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. రాజు థెట్ అమర్ రహే అంటు నినాదాలు చేశారు. దుకాణాలను మూసివేయించారు.