సంజు చిత్ర బృందానికి అబూసలేం లీగల్ నోటీసులు
ముంబై: 1993 ముంబై పేలుళ్ల కేసులో శిక్ష అనుభవిస్తున్న నిందితుడు గ్యాంగ్స్టర్ అబూ సలేం ..బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సంజు చిత్ర బృందానికి తన లాయర్ ద్వారా లీగల్ నోటీసులు పంపారు. ముంబై పేలుళ్ల తర్వాత చెలరేగిన మతఘర్షణల్లో సంజయ్ దత్కు మారణాయుధాలు సప్లై చేసింది అబూ సలేం అంటూ ఈ చిత్రంలో చూపించారని... కానీ వాస్తవానికి సంజయ్ దత్ను తన క్లైంట్ అబూసలేం ఎప్పుడూ కలిసిన దాఖలాలు లేవని అబూ సలేం లాయర్ తెలిపారు.
తనను తప్పుగా చూపించే ప్రయత్నం చిత్రం బృందం చేసిందంటూ ఆరోపిస్తూ 15 రోజుల్లో ఆ సినిమా నుంచి ఆ సీన్లు కట్ చేయకుంటే లీగల్గా ప్రొసీడ్ అవుతామని లాయర్ హెచ్చరించారు. ఈ క్రమంలోనే దర్శకుడు రాజ్కుమార్ హిరాణీ, విధు వినోద్ చోప్రా, సినిమా డిస్ట్రిబ్యూటర్లకు, సినిమాకు సంబంధించిన ప్రొడక్షన్ కంపెనీలకు నోటీసులు పంపారు. తన క్లయింట్ క్యారెక్టర్ను తప్పుగా చూపించడంతో అబూసలేం పరువుకు భంగం వాటిల్లిందని నోటీసులో పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే 1993 ముంబై పేలుళ్ల కేసులో అబూ సలేం దోషిగా తేలడంతో ప్రస్తుతం యావజ్జీవకారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. దీనితోపాటు పలుదోపిడీ కేసుల్లో కూడా నిందితుడుగా ఉన్న అబూసలేంకు ఢిల్లీ కోర్టు ఏడేళ్ల కఠినకారాగార శిక్షను 2002లో విధించింది.