మరో ఎన్కౌంటర్:మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ కుడిభుజం కాల్చివేత:వికాస్ చుట్టూ ఉచ్చు: షార్ప్ షూటర్లు
లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్ ఎన్కౌంటర్లో పోలీసులు పురోగతి సాధించారు. ఎనిమిది మంది పోలీసులను కాల్చి చంపిన టాప్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ వికాస్ దుబే ప్రధాన అనుచరుడు అమర్ దుబేను పోలీసులు కాల్చి చంపారు. హమీర్పూర్ జిల్లాలోని మౌదాహాలో బుధవారం తెల్లవారు జామున చోటు చేసుకున్న ఎన్కౌంటర్ సందర్భంగా అమర్ దుబేను మట్టుబెట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
భారత్లో భీకరంగా కరోనా విస్తరణ: సరిగ్గా 7 నెలల్లో: రోజూ 2.87 లక్షల పాజిటివ్ కేసులు నమోదు
కాన్పూర్ శివార్లలోని చౌబేపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బిక్రూ గ్రామంలో ఎనిమిది మంది పోలీసులను కాల్చి చంపిన ఘటనలో అమర్ దుబే ప్రమేయం ఉన్నట్లు తేల్చారు. బిక్రూ ఎన్కౌంటర్లో అమర్ పాల్గొన్నాడని పోలీసులు తెలిపారు. వికాస్ దుబే కోసం చేపట్టిన గాలింపు చర్యల్లో భాగంగా అమర్ దుబే ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. పరారీలో ఉన్న వికాస్ దుబేను గాలించడానికి ప్రభుత్వం షార్ప్ షూటర్లతో ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) సభ్యులు ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్నారు.
మౌదాహాలో అమర్ దుబే తలదాచుకున్నట్లు పక్కా సమాచారం అందడంతో ఈ తెల్లవారు జామున ఎస్టీఎప్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అతను తలదాచుకున్న ఇంటిని చుట్టుముట్టారు. లొంగిపోవాల్సిందిగా హెచ్చరించారు. పోలీసుల హెచ్చరికలను పట్టించుకోకుండా అమర్ దుబే వారిపై కాల్పులకు తెగబడ్డాడు. దీనితో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో అతను చనిపోయినట్లు ఎస్టీఎఫ్ పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలంలో వికాస్ దుబే లేడని ధృవీకరించారు. అతని కోసం గాలిస్తున్నామని అన్నారు.
ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకోవడానికి ముందు వికాస్ దుబే గురించి సమాచారం అందడంతో పోలీసులు ఫరీదాబాద్లోని ఓ హోటల్లో సోదాలను నిర్వహించారు. పోలీసులు వస్తున్నారనే సమాచారాన్ని ముందే పసిగట్టిన అతను అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఆ సమయంలోనే వికాస్ దుబే, అమర్ దుబే వేరు పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఫరీదాబాద్ నుంచి బిజ్నౌర్కు వెళ్లే మార్గంలో వికాస్ దుబే ఓ కారులో కనిపించినట్లు పోలీసులకు సమాచారం అందడంతో అతని కోసం గాలిస్తున్నారు.