పోలీసుల దూకుడు: వరుస ఎన్కౌంటర్లు.. మరో ఇద్దరి కాల్చివేత: ఆ గ్యాంగ్ను మట్టుబెట్టే దిశగా
లక్నో: ఉత్తర ప్రదేశ్ పోలీసులు వరుస ఎన్కౌంటర్లతో చెలరేగుతున్నారు. గ్యాంగ్స్టర్లను రూపుమాపేస్తున్నారు. కాన్పూర్లో ఎనిమిదిమంది పోలీసులను కాల్చి చంపిన గ్యాంగ్స్టర్ వికాస్ దూబే అనుచరుల్లో మరో ఇద్దరిని ఎన్కౌంటర్ చేశారు. వికాస్ దుబే ముఠాలోని రౌడీషీటర్లపై బుల్లెట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇప్పటికే వికాస్ దుబే కుడిభుజం అమర్ దుబేను కాల్చి చంపిన పోలీసులు మరుసటి రోజే మరో ఇద్దరిని మట్టుబెట్టారు.
పేట్రేగిన ఉగ్రవాదులు: బీజేపీ నేత, తండ్రి, సోదరుడి కాల్చివేత: 10 మంది పోలీసులు అరెస్ట్
గురువారం తెల్లవారుజామున వికాస్ దూబే సన్నిహితుడు రణబీర్ అలియాస్ బబ్బన్ శుక్లా, మరో అనుచరుడు ప్రభాత్ మిశ్రాను ఎన్కౌంటర్ చేశారు. రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. వికాస్ దూబే కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టిన ఎస్టీఎఫ్ పోలీసులకు మహేవా పోలీస్స్టేషన్ పరిధిలోని బకేవర్ జాతీయ రహదారిపై ఈ తెల్లవారు జామున 3 గంటల సమయంలో ఓ అనుమానిత స్విఫ్ట్ డిజైర్ కారు కనిపించింది.
ఢిల్లీ రిజిస్ట్రేషన్తో ఉన్న ఆ కారును పరిశీలించగా అందులో ప్రయాణిస్తోన్న నలుగురు అనుమానస్పదంగా వ్యవహరించారు. వారి గురించి ఆరా తీస్తుండగా.. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. దీనితో ఆ కారును పోలీసులు వెంబడించారు. తెల్లవారు జామున 4.30 గంటల ప్రాంతంలో బకేవర్ జాతీయ రహదారిపై గల కచౌరా గ్రామం సమీపంలో స్విఫ్ట్ డిజైర్ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీనితో అనుమానితులను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నించగా.. వారు కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో బబ్బన్ శుక్లా మరణించాడు.
Recommended Video
ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు తప్పించుకుని పారిపోయారు. ఘటనా స్థలంలో ఒక పిస్టల్, డబుల్ బారెల్ గన్, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామని ఇటాావా ఎస్ఎస్పీ ఆకాశ్ తోమర్ తెలిపారు. బబ్బన్ శుక్లాపై 50 వేల రూపాయల రివార్డు ఉందని చెప్పారు. మరో ఘటనలో పోలీసుల కట్టడీ నుంచి తప్పించుకుపోవడానికి ప్రయత్నించిన దూబే అనుచరుడు ప్రభాత్ మిశ్రాను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. విచారణ నిమిత్తం అతణ్ని తరలిస్తుండగా కాన్పూర్ సమీపంలోకి వచ్చిన తర్వాత పారిపోవడానికి ప్రయత్నించాడు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న కాల్పుల్లో ప్రభాత్ మిశ్రా హతమయ్యాడు.