గ్యాంగ్స్టర్ పైశాచికం: వ్యక్తిని చంపేసి డ్యాన్స్, పాటలు పాడాడు(వీడియో)
పంజాబ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చోసుకుంది. ఓ ఫైనాన్షియర్ను దారుణంగా హత్య చేసిన ఓ గ్యాంగ్స్టర్.. ఆ తర్వాత శవం వద్ద డ్యాన్సులు చేసి, వాహనంలో వెళుతూ పాటలు పాడి పైశాచికానందాన్ని పొందాడు.
సంగ్రూర్: పంజాబ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చోసుకుంది. ఓ ఫైనాన్షియర్ను దారుణంగా హత్య చేసిన ఓ గ్యాంగ్స్టర్.. ఆ తర్వాత శవం వద్ద డ్యాన్సులు చేసి, వాహనంలో వెళుతూ పాటలు పాడి పైశాచికానందాన్ని పొందాడు. అంతేగాక, ఇదంతా వీడియో తీసుకుని ఫేస్బుక్లో పెట్టాడు.
వివరాల్లోకి వెళితే.. దల్వీందర్ సింగ్ అలియాస్ బబ్లి రంధవా అనే గ్యాంగ్స్టర్ ఇటీవలే ఓ కేసులో బెయిల్ పొంది జైలు నుంచి విడుదలయ్యాడు. కాగా హర్దేవ్ సింగ్ అనే ఫైనాన్స్ వ్యాపారి.. దల్వీందర్ సింగ్కు రూ. 5లక్షలు అప్పు ఇచ్చాడు. ఇచ్చిన అప్పు తిరిగివ్వాలని కోరడంతో దల్వీందర్ సింగ్.. హర్దేవ్ సింగ్ తో గొడవకు దిగాడు. ఈ క్రమంలో దల్వీందర్ సింగ్ తన వద్ద ఉన్న తుపాకితో హర్దేవ్ సింగ్ను కాల్చేశాడు. తలలోకి ఐదు బుల్లెట్లు దిగడంతో హర్ దేవ్ సింగ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆ తర్వాత అతడి మృతదేహం వద్ద మరో ఐదుగురు సహచరులతో డ్యాన్సులు చేశాడు దల్వీందర్ సింగ్. అంతేగాక, దమ్ముంటే పోలీసులు తనను పట్టుకోవాలంటూ సవాల్ చేశాడు. ఈ పరిణామంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. తమకు ఇలాంటి గుండాల నుంచి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
కాగా, ఈ హత్య చేసిన తర్వాత దల్వీందర్ సింగ్.. తన ఫేస్బుక్ ఫేజీలో నాలుగు వీడియోలు పోస్ట్ చేశాడు. 'మారే హిక్ విచ్ ఫైర్ జాట్ నే(ఆ జాట్ గుండెల్లో కాల్చాడు)' అనే పాట పాడుకుంటూ.. హత్య చేసింది తానేనని ఆ వీడియోలో చెప్పాడు. అంతేగాక, చేతిలో తుపాకీని పట్టుకుని కనిపించాడు. హర్ దేవ్ ను ఎందుకు చంపింది కూడా మరో వీడియోలో తెలిపాడు. కాగా, ఈ హత్యలో దల్వీందర్ సింగ్ తోపాటు అతడి అనుచరులు అమన్ సింగ్, నాన్సీ, వరీందర్ సింగ్, సుర్జా పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు.
నిందితులను అరెస్ట్ చేసే వరకు తన కొడుకు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించడానికి వీల్లేదని మృతుడి తండ్రి సజన్ సింగ్ పట్టుబట్టారు. ఉదయం పదిగంటల సమయంలో ఇలా జరిగినా ఇంతవరకు ప్రధాన నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. వెంటనే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
కాగా, నిందితుడు దల్వీందర్ సింగ్ అలియాస్ బబ్లీ.. స్థానిక రౌడీ షీటర్ అని, అతడ్ని పట్టుకోవడానికి ఇప్పటికే పలు ప్రత్యేక పోలీసు బృందాలు బయల్దేరాయని సీనియర్ ఎస్పీ ఇందర్ బీర్ సింగ్ తెలిపారు. ఫేస్బుక్లో వీడియోలను ఎక్కడ్నుంచి అప్ లోడ్ చేశాడో గుర్తించే పనిలో ఉన్నామని చెప్పారు. నిందితుడ్ని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. హర్ దేవ్ సింగ్ హత్య హేయమైన చర్య అని అన్నారు.