మరో ఎల్జీ పాలిమర్స్: ఫార్మా కంపెనీ నుంచి గ్యాస్ లీక్: జనం ఉక్కిరిబిక్కిరి: నిద్ర లేని రాత్రి
ముంబై: అసలే మహానగరం.. కాస్త అటు ఇటుగా రెండు కోట్ల మంది నివసించే దేశ ఆర్థిక రాజధాని. అలాంటి చోట గ్యాస్ లీకేజీ సంభవించింది. ఓ ఫార్మా కంపెనీ నుంచి పెద్ద ఎత్తున గ్యాస్ వెలువడింది. ప్రజలు ఘాటు దుర్వాసనలతో ఉక్కిరిబిక్కిరికి గురయ్యారు. గ్యాస్ ప్రభావం అయిదు ప్రాంతాలపై తీవ్రంగా పడింది. అచ్చంగా ఎల్జీ పాలిమర్స్ తరహాలో భారీగా గ్యాస్ వెలువడింది. దాని తీవ్రత స్టైరిన్ గ్యాస్ స్థాయిలో లేకపోవడంతో ప్రాణాపాయం తప్పినట్లు ప్రాథమిక సమాచారం.
Recommended Video
అయ్యప్పస్వామి భక్తులకు శుభవార్త: శబరిమల ఆలయ తలుపులు తెరచుకోనున్నాయ్..కానీ!
చెంబుర్లోని ఫార్మా కంపెనీ నుంచి..
ముంబై చెంబూర్ సమీపంలోని గోవండి (ఈస్ట్) ప్రాంతంలో గల యుఎస్ విటమిన్ కంపెనీ నుంచి గ్యాస్ వెలువడినట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. శనివారం రాత్రి 9:53 నిమిషాలకు గ్యాస్ లీక్ అయినట్లు పేర్కొన్నారు. దీని ప్రభావం అయిదు ప్రాంతాలపై తీవ్రంగా పడింది. ఘట్కోపర్, పొవై, విక్రోలి, చెంబుర్, కంజూర్మార్గ్, చాందీవలి ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఈ గ్యాస్ లీకేజీ వల్ల ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు బీఎంసీకి చెందిన డిజాస్టిర్ మేనేజ్మెంట్ విభాగం అధికారులు నిర్ధారించారు.
నిద్రలేని రాత్రిని..
ఫార్మా కంపెనీ నుంచి గ్యాస్ వెలువడటం స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసింది. ఫార్మా కంపెనీలో మందులు, విటమిన్లను తయారు చేయడానికి పెద్ద ఎత్తున రసాయన పదార్థాలను వినియోగిస్తుంటారు. రసాయనిక మిశ్రమాలతోనే అన్ని ఫార్మా కంపెనీలు పని చేస్తుంటాయి. అలాంటి మందు తయారీ కంపెనీ నుంచి గ్యాస్ వెలువడిందనే సమాచారం తెలుసుకున్న తరువాత స్థానికులు ఆందోళనలకు గురయ్యారు. చెంబుర్ ప్రాంతం నుంచి పలువురు స్థానికులు పొరుగు ప్రాంతాలకు తరలివెళ్లారు. నిద్రలేని రాత్రిని గడిపారు.
17 టీమ్లను సంఘటనా స్థలానికి..
ఈ సమాచారం అందిన వెంటనే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్ అధికారులు యద్ధ ప్రాతిపదికన చర్యలను తీసుకున్నారు. 17 బృందాలను సంఘటనా స్థలానికి తరలించినట్లు వెల్లడించారు. దుర్వాసన ఎక్కడి నుంచి వెలువడిందనే విషయంపై ఆరా తీస్తున్నామని స్పష్టం చేసింది. యుఎస్ విటమిన్ కంపెనీ నుంచే గ్యాస్ వెలువడిందనే విషయాన్ని తాము ఇంకా ధృవీకరించలేదని పేర్కొంది. జాతీయ మీడియా మాత్రం యుఎస్ విటమిన్ కంపెనీ నుంచే గ్యాస్ లీక్ అయినట్లు పేర్కొన్నాయి.
అప్రమత్తంగా ఉన్నామంటూ..
గ్యాస్ వెలువడినట్లు సమాచారం అందిన వెంటనే మహారాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాకరే స్పందించారు. ఈ ఘటనపై తాము అప్రమత్తంగా ఉన్నామని, బీఎంసీ అధికారులతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకుంటున్నామని అన్నారు. ఉన్నతాధికారుల బృందాన్ని సంఘటనా స్థలానికి పంపించినట్లు తెలిపారు. ప్రజలు భయభ్రాంతులకు గురి కావొద్దని, గ్యాస్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై ఆరా తీస్తున్నామని చెప్పారు. పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నాయని ఆదిత్య థాకరే స్పష్టం చేశారు.