ముంబైని చుట్టబెట్టిన మరో ఉత్పాతం: నగర వ్యాప్తంగా గ్యాస్ వాసన: కంటి మీద కునుకు లేకుండా!
ముంబై: భారీ వర్షాలతో అల్లాడుతున్న ముంబై మహానగరం గురువారం రాత్రి నుంచీ మరో ఉత్పాతాన్ని ఎదుర్కొంది. ఎక్కడి నుంచి వచ్చిందో.. ఎలా వచ్చిందో తెలియట్లేదు గానీ ముంబై నగరం మొత్తం ఓ రకమైన వంటగ్యాస్ వంటి వాసన కొట్టింది. ముంబై నగర శివార్లతో పాటు దాదాపు అన్ని ప్రాంతాల నుంచీ పోలీసులు, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులకు ఎడతెగకుండా ఫిర్యాదులు అందాయి. ఈ సమాచారాన్ని అందుకున్న వెంటనే మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (ఎంజీఎల్) రంగంలో దిగింది. స్థానిక మున్నసిపల్ కార్పొరేషన్ అధికారుల సహకారంతో.. గ్యాస్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయం ఆరా తీస్తోంది. గ్యాస్ వాసన ఎక్కడి నుంచి వస్తోందో తెలియక ముంబై నగర వాసులు గందరగోళానికి గురయ్యారు. అగ్గిపుల్ల వెలిగిస్తే.. ఎక్కడ పేలుతుందోననే భయంతో వణికిపోయారు. రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా గడిపారు.
రాత్రంతా..నిద్ర లేకుండా
గురువారం రాత్రి 10: 45 నిమిషాల సమయంలో వ్యాపించిన ఈ గ్యాస్ వాసన సుమారు 30 నుంచి 40 నిమిషాల పాటు కొనసాగింది. ఉదర రోగ వ్యాధిగ్రస్తులు దీన్ని పీల్చలేక ఇబ్బందులు పడ్డారు. కొందరు ఆసుపత్రుల పాలైనట్లు సమాచారం. 40 నిమిషాలకు పైగా ఈ గ్యాస్ వాసన వచ్చినట్లు స్థానికుల నుంచి ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులను అందుకోవడానికి మహానగర్ గ్యాస్ లిమిటెడ్ సంస్థ యాజమాన్యం ఇదివరకే 1916 నంబర్ తో 24 గంటల పాటు పనిచేసేలా ఓ కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. రాత్రంతా ఈ కాల్ సెంటర్ కు పలువురు స్థానికులు ఫోన్లు చేశారు. తమ ప్రాంతంలో గ్యాస్ వాసన వస్తోందంటూ ఫిర్యాదు చేశారు. చెంబూర్, మన్ఖుర్ద్, గోవండి, కండీవలి, చండీవలి, పొవై, ఘట్ కోపర్, అంధేరీ, గోరేగావ్, దేవ్ నర్, విక్రోలి, దిండోషీ, విల్లే పార్లె, దహిసర్, మీరా రోడ్, బోరీవలి నేషనల్ పార్క్, నాలాసపోరా.. ఇలా ముంబై దక్షిణం, తూర్పు ప్రాంతాల్లో సుమారు 40 నిమిషాల పాటు గ్యాస్ వచ్చినట్లు మహానగర్ గ్యాస్ లిమిటెడ్, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లతో పాటు స్థానిక పోలీసులు వందలాదిగా ఫోన్ కాల్స్ అందాయి.
కారణాల కోసం అన్వేషణ..
ఈ సమాచారం అందిన వెంటనే అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆయా ప్రాంతాలకు అగ్నిమాపక వాహనాలను తరలించారు. పెద్ద సంఖ్యలో అగ్నిమాపక సిబ్బందిని మోహరింపజేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సిద్ధమయ్యారు. ఫిర్యాదులు అందిన ప్రాంతాల్లో 12 అగ్నిమాపక వాహనాలను మోహరింపజేసినట్లు బీఎంసీ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ విభాగం డైరెక్టర్ మహేష్ నర్వేకర్ తెలిపారు. గ్యాస్ వాసన హఠాత్తుగా ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై మహానగర్ గ్యాస్ లిమిటెడ్ అధికారులతో కలిసి ఆరా తీస్తున్నామని ఆయన తెలిపారు. అనంతరం గ్యాస్ వాసన తగ్గినప్పటికీ.. అది రావడానికి గల కారణాలను అన్వేషిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. మహానగర్ గ్యాస్ లిమిటెడ్ అధికారులు కూడా గ్యాస్ లీకేజీని అరికట్టడానికి ఉపయోగించే ఎనిమిది అత్యవసర వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
రాష్ట్రీయ కెమికల్స్ నుంచేనా?
చెంబూర్ చకలా ప్రాంతంలో రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (ఆర్సీఎఫ్) కర్మాగారం ఉంది. రైతులకు సరఫరా చేసే ఎరువులను తయారు చేసే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఇది. ఈ కర్మాగారం నుంచి గ్యాస్ వాసన వెలువడి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. దీనిపై ఆ సంస్థ యాజమాన్యం ఇంకా స్పందించాల్సి ఉంది. తమ కర్మాగారం నుంచి గ్యాస్ లీకైందా? లేదా? అనే విషయంపై ఆ సంస్థ యాజమాన్యం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. వంటగ్యాస్ ను సరఫరా చేయడానికి మహానగర్ గ్యాస్ లిమిటెడ్ సంస్థ ముంబై నగర వ్యాప్తంగా భూగర్భంలో పైపులను అమర్చింది. వాటి నుంచీ లీక్ అయి ఉండొచ్చని తొలుత అనుమానించారు. దీనిపై ఆ విభాగం అధికారులు కంట్రోల్ రూమ్ ద్వారా పరిశీలించగా.. ఎక్కడా గ్యాస్ పైపులు లీక్ కాలేదని తేలింది. ఈ వాసన వెలువడటానికి గల కారణాలపై అధికారులు అన్వేషిస్తున్నారు. దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టతా రాలేదు. ఇప్పటికే భారీ వర్షాలతో అల్లాడుతున్న ముంబైకర్లకు కొత్తగా ఈ గ్యాస్ వాసన వెలువడటం, దాని మీద ఏ అధికారి వద్ద కూడా స్పష్టమైన సమాచారం లేకపోవడం మరింత ఆందోళనకు గురి చేసింది.