బిల్ గేట్స్ నన్ను డబ్బులు అడిగేందుకు వచ్చారు!: కరుణానిధి ఆత్మవిశ్వాసంతో చెప్పిన వేళ!
చెన్నై: దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి రాజకీయాల్లోనూ, అటు సినీ రంగంలోనూ ఎంతో కీలకంగా వ్యవహరించారు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటూ ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించేవారు. తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేయడం కరుణానిధి అలవాటుగా మార్చేసుకున్నారు.
ఎవరీ కరుణానిధి? ఇదీ రాజకీయ నేపథ్యం-ఎన్నో రికార్డ్లు: కీలక అంశాలు
కరుణానిధి ఇంటికి బిల్ గేట్స్
కరుణానిధి ఎంత ధీమాగా, ఆత్వవిశ్వాసంతో ఉండేవారో తెలపడానికి ఇది మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 2005లో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ 2005లో చెన్నైలోని డీఎంకే అధినేత కరుణానిధి ఇంటికి వచ్చారు. ఆ సమయంలో మీడియా ప్రతినిధులు కరుణపై పలు ప్రశ్నలు సంధించారు.
బిల్ గేట్స్ డబ్బులు అడిగేందుకు వచ్చారు..
‘ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు మీ ఇంటికి వచ్చారు కదా! మీరు ఎలా ఫీలవుతున్నారు?' అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. దీనికి కరుణానిధి స్పందిస్తూ.. ‘బిల్గేట్స్ నన్ను డబ్బులు అడగడానికి వచ్చారు' అని చెప్పడంతో మీడియా ప్రతినిధులు ఖంగుతిన్నారు.
రెండే ఆయుధాలు.. ప్రధాని ఎందుకు కాకూడదంటే.?
రెండే రెండు ఆయుధాలతో తమిళ రాజకీయాలను కరుణ శాసించారు. అందులో ఒకటి వాగ్ధాటి, రెండోది ఆయన రచనా నైపుణ్యం. అంతేగాక, ప్రధాని అయ్యే అవకాశం ఎందుకు వదులుకున్నారని అడిగితే ‘నా స్థాయి ఏంటో నాకు తెలుసు' అని కరుణానిధి తన పరిధిని తెలియజేస్తూ మీడియాకు సమాధానమివ్వడం గమనార్హం.
చదువు మధ్యలోనే ఆపేసినా..
కరుణ ముందుతరం నేతలు అన్నాదురై, మదిఅలగన్ ఉన్నత చదువులు చదివితే.. కరుణ మాత్రం స్కూల్ మధ్యలోనే చదువు వదిలేశారు. అయితే, వారి కంటే ఎక్కువ రచనలు చేశారు. 17ఏళ్ల వయస్సులోనే హిందీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనేందుకు విద్యార్థులను సమీకరించారు. సహచరులతో కలిసి తమిళనాడు స్టూడెంట్ క్లబ్ను స్థాపించారు.
నాయకుడిగా ఎదిగారు
సీఎన్ అన్నాదురైని 1940లో తొలిసారి కరుణానిధి కలిశారు. పెరియార్తో విభేదాలు రావడంతో 1949లో అన్నాదురై డీఎంకేను స్థాపించారు. ఆ సమయంలో అన్నాదురైకి కరుణ సన్నిహితుడిగా మారారు. పార్టీ ప్రచార కమిటీ మెంబర్గానే కాకుండా పార్టీని ముందుండి నడిపించి నాయకుడిగా ఎదిగారు.
తమిళుల గుండెల్లో చిరస్థాయిగా..
కాగా, కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఐదుసార్లు పనిచేశారు. 13సార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఒక్కసారి కూడా ఓడిపోలేదు. డీఎంకేలో తిరుగులేని నాయకుడిగా ప్రజల్లో ఎనలేని అభిమానం చూరగొన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక ప్రజా సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి తమిళ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచపోయారు. కరుణానిధి పాలన పేద ప్రజలకు అండగా ఉండేదని పలువురు విశ్లేషకులు కూడా ప్రశంసించారు.