గౌరీ లంకేష్ హత్యకేసు: 18వ నిందితుడు జార్ఖండ్లో అరెస్టు..హిందూ సంస్థకు చెందినవాడిగా గుర్తింపు
జార్ఖండ్ : ప్రముఖ జర్నలిస్టు గౌరీలంకేష్ హత్యకేసులో బెంగళూరు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ కేసును విచారణ చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రుషికేష్ దేవ్రికర్ అలియాస్ మురళీని జార్ఖండ్లోని ధన్బాద్లో అరెస్టు చేశారు. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రుషికేష్ దేవ్రికర్ కత్రాస్ ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడే మారుపేరుతో ఓ బిల్డింగ్కు కేర్టేకర్గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఔను అతన్ని కూడా నేనే చంపాను: గౌరీ లంకేష్ హత్యకేసు విచారణలో ట్విస్టులు
గురువారం రుషికేష్ను అరెస్టు చేసిన బెంగళూరు పోలీసులు స్థానిక కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. విచారణ నిమిత్తం నిందితుడిని బెంగళూరుకు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును అనుమతి కోరనున్నట్లు ధన్బాద్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కిషోర్ కౌశల్ చెప్పారు. కత్రాస్లోని రాజ్గదియా మార్కెట్ ప్రాంతంలో దేవ్రికర్ నివాసం ఉంటుంన్నాడని అక్కడి నుంచే బెంగళూరు పోలీసులు అరెస్టు చేసినట్లు చెప్పారు. గత ఐదు రోజులుగా దేవ్రికర్ కదలికలపై నిఘా ఉంచినట్లు ఎస్ఎస్పీ కిషోర్ తెలిపారు. అధిక సంఖ్యలో ఫోన్నెంబర్లు మార్చుతుండటంతో అనుమానం వచ్చిన పోలీసులు దేవ్రికర్ మొబైల్ లొకేషన్ను ట్రాక్ చేసి అతన్ని పట్టుకున్నట్లు కిషోర్ కౌశల్ చెప్పారు.
రుషికేష్ ఇంటిలో బెంగళూరు పోలీసులు సోదాలు నిర్వహించగా అతని గదిలో హిందూ సంఘంకు చెందిన సనాతన్ ధర్మ పుస్తకాలు దొరికాయని తెలిపారు. గోవాలో ఓ స్నేహితుడు రుషికేష్కు ఉద్యోగం ఇవ్వాలని రికమెండ్ చేయడంతోనే తనకు కేర్టేకర్ ఉద్యోగం ఇచ్చినట్లు రుషికేష్ పనిచేస్తున్న భవంతి యజమాని చెప్పాడు. రుషికేష్ ఇలా క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నట్లు తనకు తెలియదని చెప్పాడు
ఇదిలా ఉంటే ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేష్ సెప్టెంబర్ 5, 2017న హత్యకు గురయ్యారు. బెంగళూరులోని తన నివాసం బయటే ఆమెను కొందరు కాల్చి చంపేశారు. ఇప్పటివరకు కేసుకు సంబంధించి సిట్ 17 మందిని అరెస్టు చేయగా 18వ నిందితుడిగా రుషికేష్ ఉన్నాడు. ఈమెకు హత్య వెనక హిందూ సంస్థ సనాథన్ సంత ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే గౌరీ లంకేష్ హత్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని సనాతన్ సంత చెప్పుకొచ్చింది.