గౌరీ లంకేశ్ హత్య కేసు: ప్రధాన సూత్రధారి ఆయనే..!
సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యకేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) పురోగతి సాధించింది. ఈ కేసుకు సంబంధించి సిట్ అరెస్టు చేసిన నవీన్ అనే వ్యక్తి నేరాన్ని ఒప్పుకున్నాడు. గౌరీ లంకేశ్ హత్యకు కుట్ర చేసింది బెంగళూరు విభాగానికి చెందిన హిందూ జనజాగృతి సమితి కోఆర్డినేటర్ మోహన్ గౌడ అని విచారణ సందర్భంగా నవీన్ చెప్పినట్లు సిట్ వెల్లడించింది.
సుజీత్ కుమార్ అలియాస్ ప్రవీన్ అనే వ్యక్తిని మోహన్ గౌడ తనకు పరిచయం చేసినట్లు చెప్పిన నవీన్... గౌరీ లంకేశ్ను తాను హత్య చేయలేదని... తుపాకులు, బుల్లెట్లు మాత్రమే సరఫరా చేసినట్లు చెప్పుకొచ్చాడు. గౌరీ లంకేశ్ హత్యను బయటి వ్యక్తులు చేశారని సిట్కు వివరించాడు. జూన్ 2017లో గోవాలో హిందూ జనజాగృతి సమితి ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన సందర్భంగా... హిందూ మతాన్ని ఎలా పరిరక్షించుకోవాలన్న అంశంపై మాట్లాడినట్లు నవీన్ తెలిపాడు. తన ప్రసంగంపై మోహన్ గౌడ పొగడ్తల వర్షం కురిపించారని చెప్పిన నవీన్... తనలాంటి భావజాలం ఉన్న వ్యక్తులు సంస్థలో చాలామంది ఉన్నారని భవిష్యత్తులో వారు తనను కలుస్తారని మోహన్ గౌడ చెప్పినట్లు నవీన్ వివరించారు.
ఇదిలా ఉంటే... గౌరీ లంకేశ్ హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని , ఆమెను అంతమొందించాలని అందుకు సహకరించాల్సిందిగా ప్రవీణ్ తనతో చెప్పినట్లు నవీన్ సిట్కు తెలిపాడు. తను తుపాకులు, బుల్లెట్లు మాత్రమే సరఫరా చేసినట్లు నవీన్ చెప్పాడు. సెప్టెంబర్ 5, 2017న అంటే గౌరీ లంకేశ్ హత్య జరిగిన రోజున తను మంగళూరులోని ఓ ఆశ్రమంలో ఉన్నట్లు వివరించాడు. ప్రసార మాధ్యమాల ద్వారా గౌరీ లంకేశ్ హత్య గురించి తెలుసుకున్నట్లు నవీన్ చెప్పాడు.
గౌరీ లంకేశ్ హత్య కేసులో తనను ఇరికించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని మోహన్ గౌడ ఆరోపించారు. త్వరలోనే ఇందుకు సంబంధించి మీడియా సమావేశం నిర్వహించి అన్ని విషయాలు వెల్లడిస్తానని చెప్పారు.