కాంగ్రెస్, ప్రకాశ్రాజ్కి షాక్: బీజేపీ తరపున గౌరీ లంకేష్ సోదరుడు ప్రచారం, సిద్ధరామయ్యపై ఫైర్
బెంగళూరు: ఏడు నెలల క్రితం బెంగళూరుకు చెందిన జర్నలిస్టు గౌరీ లంకేష్ రాజేశ్వరి నగర్లోని తన నివాసంలోనే హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో దర్యాప్తు జరిపిన సిట్.. ఓ నిందితుడ్ని అరెస్ట్ చేసింది. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.
కాగా, జర్నలిస్టు గౌరీ హత్య నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం, బీజేపీపై ఇటు కాంగ్రెస్, అటు ప్రముఖ సినీనటుడు ప్రకాశ్ రాజ్ కూడా మండిపడ్డారు. ఈ హత్యలు కేంద్రం, బీజేపీ ప్రోద్బలంతోనే జరుగుతున్నాయంటూ ఆరోపణలు గుప్పించారు. అయితే, తాజా పరిణామం మాత్రం వీరికి షాక్ గురిచేసిదిగానే ఉంది.
బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మల్లేశ్వరం నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన డా. అశ్వత్ నారాయణ తరపున గౌరీ లంకేష్ సోదరుడు ఇంద్రజిత్ లంకేష్ ప్రచారం నిర్వహించారు. తనకు రాజకీయాలతో పెద్దగా సంబంధం లేదని, అశ్వత్ నారాయణ తనకు మంచి స్నేహితుడని చెప్పారు. అతడు ప్రజలకు మంచి చేస్తాడనే ఉద్దేశంతోనే తాను ప్రచారం చేస్తున్నట్లు ఇంద్రజిత్ తెలిపారు. అంతేగాక, అశ్వత్ నారాయణ భారీ మెజార్టీతో గెలుస్తాడని చెప్పారు.
అందుకే ప్రచారం
‘జనతా దల్, బీజేపీ నుంచి చాలా మంది నన్ను ప్రచారం చేయమని చెప్పారు. అయితే, నా భావజాలం అది కాకపోవడంతో అందుకు ఒప్పుకోలేదు. అశ్వత్ నారాయణ మంచి వ్యక్తి కాబట్టే ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తున్నా' అని గౌరీ లంకేష్ సోదరుడు ఇంద్రజిత్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ మంచి నాయకుడని అన్నారు. మార్పు రావాలంటే బీజేపీకి ఓటేయాలని ప్రచారం సందర్భంగా ఆయన నినదించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు.
బీజేపీకి ప్రచారంపై ఇంద్ర సోదరి కవిత స్పందిస్తూ..
కాగా, గౌరీ లంకేష్ తీవ్రంగా వ్యతిరేకించే ఓ పార్టీకి ఇంద్రజిత్ ఓ పార్టీకి ప్రచారం చేయడం పట్ల గౌరీ లంకేష్ మరో సోదరి కవిత స్పందిస్తూ.. ‘నేను రాజకీయ వ్యక్తిని కాదు. మా తండ్రి వామపక్ష భావజాలం గల వ్యక్తి. నా సోదరి కూడా అదే మార్గంలో వెళ్లింది. నేను ఎప్పుడూ ఆమెకు మద్దతుగానే ఉండేదాన్ని. అయితే, ఎవరికైనా వారి సొంత మార్గాన్ని ఎంచుకునే హక్కు ఉంటుంది. ఇంద్రను నేను వ్యతిరేకించలేను. మేము ఎప్పుడూ వేర్వేరు పడవల్లోనే ప్రయాణం చేశాం. మేము ఒప్పుకున్నా లేకపోయినా మేము వేర్వేరు మార్గాలను ఎంచుకున్నాం. నేను అతడ్ని అంగీకరించినట్లయితే, అతనితో నిలబడాల్సి వస్తుంది' అని వ్యాఖ్యానించారు. గౌరీ హత్య కేసులో అరెస్టైన నిందితుడు నార్కో టెస్టుకు అంగీకరించడం లేదని, అతడు నోరు తెరిస్తే మరింతమంది నిందితులు బయటికొస్తారని తెలిపారు. రైట్ వింగ్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఎవరికైనా మద్దతు ఇస్తామని చెప్పారు. రైట్ వింగ్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ప్రకాశ్ రాజ్ లాంటి వ్యక్తులకు మద్దతిస్తానని చెప్పారు. ఇంద్రజిత్ బీజేపీ వెంట వెళ్లాలనుకుంటే వెళ్లనివ్వాలని అన్నారు. ప్రకాశ్ రాజ్ బీజేపీకి వ్యతిరేకంగా విమర్శుల చేస్తూ విమర్శలను ఎదుర్కొంటున్నారని చెప్పారు. కాగా, ప్రకాశ్ రాజ్.. గౌరీ లంకేష్ ఫ్యామిలీ ఫ్రెండ్ కావడం గమనార్హం. బీజేపీకి కాకుండా ఏ పార్టీకి ఓటేసిన తనకు అభ్యంతరం లేదని ప్రకాశ్ రాజ్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
గౌరీ హత్యకు సిద్ధరామయ్య ప్రభుత్వానిదే బాధ్యత
ఇది ఇలా ఉండగా, ఇంద్రజిత్ మాట్లాడుతూ.. తన సోదరి గౌరీ లంకేష్ హత్యకు సిద్ధరామయ్య ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. తన సోదరిని చంపింది రైట్ వింగా? లెఫ్ట్ వింగా? అనేది తెలియదు, అయితే, గౌరీ హత్యకు మాత్రం సిద్ధరామయ్య ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. సిద్ధరామయ్య ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైన కారణంగానే తన సోదరి హత్యకు గురైందని అన్నారు. నక్సలైట్లను జనజీవన శ్రవంతిలోకి తీసుకొచ్చేందుకు గౌరీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో సిద్ధరామయ్య ప్రభుత్వం ఆమెకు భద్రత కల్పించాల్సి ఉండగా, అలా చేయలేదని అన్నారు.