అక్కడి నుంచే గౌతం గంభీర్ పోటీ...న్యూ ఢిల్లీ సీటు మీనాక్షి లేఖికి ఇచ్చిన బీజేపీ
ఢిల్లీ: బీజేపీ తీర్థం పుచ్చుకున్న నెలరోజుల్లోనే ప్రముఖ క్రికెటర్ గౌతం గంభీర్కు కమలం పార్టీ తూర్పు ఢిల్లీ లోక్సభ టికెట్ కేటాయించింది. డిసెంబర్ 2018లో క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక గౌతం గంభీర్ పాలటిక్స్ను ఫాలో అవుతూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నాడు. అంతేకాదు కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాడు. మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలకు, విధానాలను సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించేవాడు.
ఇక గౌతం గంభీర్తో పాటు మీనాక్షి లేఖికి కూడా బీజేపీ ఈసారి టికెట్ కేటాయించింది. మీనాక్షిలేఖి ఢిల్లీ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తారు.అయితే నార్త్ వెస్ట్ ఢిల్లీ నియోజకవర్గానికి అభ్యర్థిని ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఇక ఢిల్లీ లోక్సభ స్థానం దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సీటు. గతంలో ఈ స్థానం నుంచి మాజీ ప్రధాని వాజ్పేయి, మాజీ కేంద్ర మంత్రి అద్వానీ, జగ్మోహన్లు ఎంపీలుగా గెలిచారు. 1951లో ఏర్పాటైన ఈ పార్లమెంటరీ నియోజకవర్గం బీజేపీకి కంచుకోటగా నిలుస్తూ వస్తోంది.
గౌతం గంభీర్ ప్రత్యర్థులుగా కాంగ్రెస్ నుంచి అరవిందర్ సింగ్ లవ్లీ, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అతిషిలు ఉన్నారు. ఇక మీనాక్షి లేఖికి ప్రత్యర్థులుగా ఆప్నుంచి బ్రజేష్ గోయల్ ఉండగా... కాంగ్రెస్ నుంచి అజయ్ మాకెన్లు బరిలో ఉన్నారు. మార్చి 22న కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ సమక్షంలో గౌతం గంభీర్ బీజేపీ కండువా కప్పుకున్నారు. మే 12న ఢిల్లీ రాష్ట్రానికి పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి.మే 23న ఫలితాలు వెలువడుతాయి.