కేజ్రీవాల్ ప్రభుత్వానికి గంభీర్ చురకలు, తీవ్ర ఆగ్రహం
ఢిల్లీ: క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఢిల్లీ ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సమస్యల పైన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆసక్తికరంగా స్పందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గంభీర్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఢిల్లీలో చికెన్ గున్యా, డెంగ్యూ వ్యాధులు ప్రబలుతోన్న విషయం తెలిసిందే. ఈ జ్వరాల కారణంగా దాదాపు ఇరవై మంది వరకు మృత్యువాత పడ్డారు. దీనిపై వరుస ట్వీట్ర్లలో గంభీర్ స్పందించారు.
ప్రజలంతా జ్వరాలతో అల్లాడుతున్న సమయంలో అండగా ఉండాల్సిన నేతలు, విదేశీ పర్యటనలకు వెళ్లడంపై గంభీర్ తీవ్రంగా స్పందించారు. ప్రజలు చనిపోతుంటే పాలకులు స్టడీ టూర్ పేరిట విదేశాల్లో ఉండటం, పరిస్థితి తీవ్రత తెలిసినా కూడా వెంటనే భారత్కు రాకపోవడం దురదృష్టకరమన్నాడు.
పాఠశాలలు ఎంతకాలమైనా వేచి ఉంటాయని మృత్యువు వేచి చూడదని ఘాటుగా వ్యాఖ్యానించాడు. రాజకీయ ఆరోపణలు చేస్తూ బంతిని ఒకరి కోర్టు నుంచి మరొకరి కోర్టుల్లోకి నెట్టుకోకుండా, పరిపాలనలో నిమగ్నమై, ప్రజల ఇబ్బందులను తొలగించాలని సలహా ఇచ్చాడు.
చికున్ గున్యా పీడిస్తున్న సమయంలో చాలినంత మంది ఏఏపీ నేతలు విధుల్లో లేకపోవడం బాధాకరమన్నాడు. గంభీర్ ట్వీట్లకు గంటల్లోనే వేలాది రీట్వీట్లు వస్తున్నాయి. కాగా, కొద్ది రోజుల క్రితం కేజ్రీవాల్ డెంగ్యూ విషయమై స్పందిస్తూ.. తమకు అధికారాలు లేవని, ప్రధాని మోడీని అడగాలని చెప్పడం గమనార్హం.