కేబీసీలో జస్ట్ మిస్ : గాంధీ సహకారంతో ఏర్పాటు అయిన మూడు సాకర్ క్లబ్ల పేరేమిటి..?
ముంబై: కౌన్బనేగా కరోడ్ పతి.. ఈ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ క్విజ్ ప్రోగ్రాంలో ముగ్గురు కోటీశ్వరులయ్యారు. అయితే జాక్పాట్ రూ.7 కోట్లు ఎవరూ కొట్టలేకపోయారు. బుధవారం టెలికాస్ట్ అయిన ఎపిసోడ్లో గౌతం కుమార్ ఝా అనే రైల్వే ఉద్యోగి చివరి ప్రశ్నకు సమాధానం తెలియక క్విట్ అయ్యాడు. దీంతో రూ.కోటితో సంతృప్తి చెందాడు.
రూ.80వేల వద్ద తొలి లైఫ్ లైన్
గేమ్ ప్రారంభమయ్యాక రూ.80వేలు ప్రశ్న వద్ద గౌతం తొలి లైఫ్లైన్ వినియోగించుకున్నాడు. కోల్కతాలో ఏ భవనంను వారసత్వ సంపదగా గుర్తిస్తారన్న ప్రశ్నకు సమాధానం తెలియక ఆడియెన్స్ పోల్పై ఆధారపడ్డాడు గౌతం. మెజార్టీ ఆడియెన్స్ రైటర్స్ బిల్డింగ్కు ఓటు వేయడంతో ఆడియెన్స్ సమాధానంతోనే వెళ్లి ఆ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పాడు. స్వతహాగా రైల్వే ఉద్యోగి అయిన గౌతంకు రైల్వేస్కు సంబంధించిన రూ.1.6 లక్షల ప్రశ్నను బిగ్ బీ తన స్క్రీన్పై ఉంచారు. ఈ మధ్య రైల్వే శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్గా దేన్ని పేర్కొందని అడిగారు. ఇక్కడ కూడా లైఫ్ లైన్ వినియోగించుకుని జైపూర్ అని సరైన సమాధానం ఇచ్చారు.
ఆస్క్ది ఎక్స్పెర్ట్ ఆప్షన్తో రూ. 50 లక్షలు
రూ.25 లక్షల ప్రశ్న వద్ద మూడో లైఫ్లైన్ వినియోగించుకున్నాడు గౌతం కుమార్ . ఈ కింది ప్రముఖ వ్యక్తుల్లో కెనడా పౌరసత్వం లభించిన వారెవరు అని అడుగగా దీనికి 50:50 లైఫ్లైన్ వినియోగించుకుని దలైలామా అని సరైన సమాధానం ఇచ్చాడు. ఇక రూ.50 లక్షల ప్రశ్నకు చివరి లైఫ్ లైన్ అయిన ఆస్క్ ది ఎక్స్పర్ట్ వినియోగించుకున్నాడు. ఈ ప్రశ్నకు నేహా బాతం అనే మహిళ సమాధానం చెప్పి గౌతం రూ.50 లక్షలు గెలుచుకునేందుకు సహాయపడింది.
చివరి ప్రశ్నకు చేతులెత్తేసిన గౌతం
ఇక రూ.కోటి ప్రశ్నకు సన్నద్ధం అయ్యాడు. ఏ భారతీయ నౌకలో ప్రయాణిస్తూ ప్రముఖ కవి ఫ్రాన్సిస్ స్కాట్ కీ డిఫెన్స్ ఆఫ్ ఫోర్ట్ మెక్హెన్రీ అనే పద్యం రాశారు అని అడిగారు. అదే అమెరికా జాతీయగీతంగా కూడా మారిందని చెప్పారు. హెచ్ఎంఎస్ మిన్డెన్ అని చెప్పి రూ. కోటి గెలుచుకున్నాడు. ఇక చివరి ప్రశ్న జాక్ పాట్ ప్రశ్నగా డర్బన్, ప్రిటోరియా, జోహాన్నెస్బర్గ్లలో మహాత్మాగాంధీ సహకారంతో ఏర్పాటు చేసిన మూడు సాకర్ క్లబ్ల పేరేమిటి అని అడిగారు..? అయితే దీనికి సరైన సమాధానం పాసివ్ రెసిస్టర్స్ కాగా ఆ సమాధానం తెలియక మధ్యలోనే క్విట్ అయి రూ. కోటి గెలుచుకున్నారు గౌతం కుమార్ ఝా.