పెళ్లికి ముందు హోమో సెక్సువల్స్... పెళ్లయ్యాక గే పార్ట్నర్ హత్య, కేసును చేధించిన పోలీసులు
థానే: తన గే పార్ట్నర్ను హత్య చేసిన ఘటనలో థానే పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. దీంతో పోలీసులకు దాంబీవాలి జిల్లాలో దొరికిన మృతదేహం కేసును పరిష్కరించగలిగారు. అయితే ఈ క్రైమ్ స్టోరీలో ట్విస్టులేంటో మీరే చదవండి.
తండ్రీ కొడుకుల వయస్సున్న వారు గే పార్ట్నర్స్
తండ్రీ కొడుకుల వయస్సున్న ఇద్దరు వ్యక్తులు హోమోసెక్సువల్ సంబంధం పెట్టకున్నారు. ప్రఫుల్ పవార్కు 27ఏళ్ల వయసుండగా.. మృతుడు ఉమేష్ పాటిల్కు 56 ఏళ్ల వయస్సు ఉంటుంది.మృతుడు ఉమేష్ పాటిల్ నవీ ముంబైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అంతకుముందు ముంబై సెషన్స్ కోర్టులో స్టెనోగా పనిచేసి రిటైర్ అయ్యాడు. కోప్రీ ప్రాంతంలో నివాసముంటున్న ఉమేష్ పాటిల్ రెండు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. కేసు నమోదు చేయగా పోలీసులు అతనికోసం గాలించారు. అయితే దాంబీవాలి ప్రాంతంలోని రైల్వే పట్టాల పక్కన ఓ బ్యాగును పోలీసులు కనుగొన్నారు. బ్యాగు తెరిచి చూడగా కనిపించకుండా పోయిన ఉమేష్ పాటిల్ మృతదేహం అందులో కుక్కి ఉంది. ఇది చూసిన పోలీసులు షాక్కు గురయ్యారు.
లోకల్ ట్రైన్లో పరిచయం.. ఆపై ఇంట్లో సంబంధం
ఇక విచారణ ప్రక్రియలో భాగంగా పోలీసులు ప్రఫుల్ పవార్ను ఎంక్వైరీ చేసినట్లు థానూ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజ్కుమార్ కొత్మీర్ చెప్పారు. ప్రఫుల్ పవార్ మరియు పాటిల్ ఇద్దరూ ఆరు నెలల క్రితం ఓ లోకల్ ట్రైన్లో ఒకరికొకరు పరిచయం అయ్యారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఇక ఈ పరిచయం వారి ఇళ్ల వరకు తీసుకెళ్లింది. అవివాహితుడైన ఉమేష్ పాటిల్ దాంబీవాలిలోని ప్రఫుల్ పవార్ ఇంటికి వెళ్లేవాడని పోలీసులు చెప్పారు. అక్కడే ఇద్దరూ స్వలింగ సంపర్క సంబంధం అలవర్చుకున్నట్లు పోలీసులు చెప్పారు.
పెళ్లి కావడంతో గే పార్ట్నర్ను దూరంగా ఉంచిన పవార్
ఇక కొద్ది రోజులకు 27ఏళ్ల ప్రఫుల్ పవార్కు వివాహం జరిగింది. ఇక పటేల్తో స్వలింగ సంపర్క సంబంధం ప్రమాదమని భావించి ఉమేష్ పాటిల్ను దూరంగా ఉంచాడు. అతనితో సంబంధం పెట్టుకుంటే తన వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయని భావించాడు. ఫిబ్రవరి 4వ తేదీన పవార్ ఇంట్లో తన భార్య లేని సమయంలో పాటిల్ ఇంటికొచ్చాడు. తనను ఎందుకు దూరంగా ఉంచాడో గట్టిగా పవార్ను ప్రశ్నించాడు పాటిల్. ఇక్కడే వీరిద్దరికీ వాగ్వాదం జరిగి అది కాస్త గొడవకు దారితీసింది. దీంతో పవార్ పాటిల్ గొంతును నులిమి హత్యచేశాడని పోలీసులు చెప్పారు. అనంతంరం మృతదేహాన్ని ఓ బ్యాగులో కుక్కి, రైల్వే పట్టాల పక్కను ఉన్న పొదల్లోకి విసిరేసినట్లు పోలీసులు చెప్పారు. ఇదిలా ఉంటే 2013లో కూడా పవార్పై హత్యాయత్నం కేసు నమోదైందని పోలీసులు చెప్పారు.