జమ్మూకాశ్మీర్ లెఫ్ట్నెంట్ గవర్నర్ పదవికి జీసీ ముర్ము రాజీనామా: కొత్త ‘కాగ్’గా?
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లెఫ్ట్నెంట్ గవర్నర్ గిరీష్ చంద్ర ముర్ము తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం ముర్ము తన రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్కు పంపారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
తదుపరి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్)గా నియమితులవుతారని సమాచారం. ప్రస్తుత కాగ్ రాజీవ్ మెహ్రిషి ఈ వారంలో పదవి విరమణ పొందనున్నారని, ఆయన స్థానంలో ముర్ము నియమితులు అవుతారని తెలిసింది.
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్కు ముర్ము తన రాజీనామా లేఖను పంపారని, అయితే, అది ఆయనకు చేరిందో లేదో తెలియదని, దాన్ని ఆయన అంగీకరించారా? లేక తిరస్కరించారా? అనే విషయంపై కూడా ఇంకా తెలియ రాలేదని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.
జమ్మూకాశ్మీర్ తొలి లెఫ్ట్నెంట్ గవర్నర్గా ముర్ము గత అక్టోబర్లో నియమితులయ్యారు. జమ్మూకాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 కింద జమ్మూకాశ్మీర్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి ఏడాది కావస్తున్న ఆగస్టు 5 రోజునే ముర్ము తన పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా, బుధవారం ఉదయం ముర్ము జమ్మూకాశ్మీర్లో భద్రతా పరిస్థితులపై సమీక్షించడం గమనార్హం.