జడ్జీ కాదు కట్న పిశాచి: రూ.51లక్షలు, 101గోల్డ్ కాయిన్స్, 2లగ్జరీ కార్లిచ్చినా..
ఆయన ఉన్నతమైన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రజలకు న్యాయం చేయాల్సిన స్థానంలో ఉండి కూడా కట్నం కోసం కక్కుర్తి పడ్డాడు. కోట్ల కొద్ది కట్నం ఇచ్చినా.. సరిపోలేదంటూ భార్యను చిత్రహింసలకు గురిచేశాడు.
ఛండీఘర్: ఆయన ఉన్నతమైన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రజలకు న్యాయం చేయాల్సిన స్థానంలో ఉండి కూడా కట్నం కోసం కక్కుర్తి పడ్డాడు. కోట్ల కొద్ది కట్నం ఇచ్చినా.. సరిపోలేదంటూ భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. చివరకు ఆమె మరణానికి కారణమై.. కటకటాల పాలయ్యాడు. దర్యాప్తు చేసిన సీబీఐ అతనిపై ఛార్జీషీటు దాఖలు చేసింది.
వివరాల్లోకి వెళితే.. 2013లో హర్యానా పంచకులకు చెందిన గీతాంజలి అనుమానాస్పదంగా మృతి చెందింది. కాగా, జడ్జీగా పని చేస్తున్న ఆమె భర్త రణ్వీత్ గార్గ్ క్రూరంగా కట్నం కోసం హింసించడంతోనే గీతాంజలి చనిపోయినట్లు సీబీఐ తన ఛార్జీషీటులో పేర్కొంది.
ఈ కేసులో గార్గ్ తోపాటు అతని తండ్రి, మాజీ సెషన్స్ జడ్జి కేకే గార్గ్, అతని తల్లి రచన గార్గ్ లపై డౌరీ డెత్(కట్నం మృతి), క్రూరంగా ప్రవర్తించడం, నేరపూరిత కుట్ర తదితర అభియోగాలు మోపింది. ఈ క్రమంలో జడ్జీ పోస్ట్ నుంచి సస్పెండైన రణ్వీత్ గార్గ్.. ప్రస్తుతం జైలులో ఉన్నాడు. అతని తల్లిదండ్రులు ముందస్తు బెయిల్ తీసుకుని బయటికి వచ్చారు.
సీబీఐ ఛార్జీషీటు ప్రకారం.. 2007లో గీతాంజలి-రణ్వీత్ గార్గ్ల వివాహం జరిగింది. పెళ్లి సమయంలో గార్గ్కు కట్నం కింద రూ.51లక్షలు, 101 బంగారు నాణెలు, విలాసవంతమైన గృహోపకరణాలతోపాటు ఓ లగ్జరీ కారు ఇచ్చారు. 2008లో రూ. 21.6లక్షల విలువ చేసే స్కోడా సూపర్బ్ కారును కానుకగా ఇచ్చారు.
2011లో గార్గ్ తల్లిదండ్రుల ఒత్తిడితో గీతాంజలి తల్లిదండ్రులు మరో రూ. 16.3లక్షల ఫ్లాట్ను సోనెపట్లో కొనిచ్చారు. అయినా.. గార్గ్ కట్నం దాహం తీరలేదు. పంచకుల సెక్టార్ 25లో రూ. 50లక్షల ఇల్లు కొనివ్వాలని నిత్యం గీతాంజలిని చిత్రహింసలకు గురిచేసేవాడు.
ఆ తర్వాత 2013మేలో తనకు గుర్గావ్లో పోస్టింగ్ రావడంతో పిల్లల స్కూల్ అడ్మిషన్ కోసం రూ. 2.2లక్షలు తీసుకురావాలని గీతాంజలిని హింసించాడు. ఈ క్రమంలో ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గార్గ్.. చిత్రహింసలకు గురిచేయడం వల్లే తీవ్ర మానసికక్షోభకు గురైన గీతాంజలి మృతి చెందిందని సీబీఐ తన ఛార్జీషీటులో పేర్కొంది.