17ఏళ్ల సుదీర్ఘ విచారణ: దండుపాళ్యం ముఠాకు జీవిత ఖైదు
బనశంకరి: కర్ణాటకలోని బందిపోటు ముఠా 'దండుపాళ్యం గ్యాంగ్' నేరాలు రుజువు కావడంతో ఆ ముఠాలోని ఐదుగురికి యావజ్జీవ శిక్ష విధిస్తూ పరప్పన అగ్రహార ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది.
వివరాళ్లోకి వెళితే.. 2000 సంవత్సరంలో నగరంలోని అగ్రహారదాసరహళ్లిలో దొడ్డహనుమ, మునికృష్ణ, లక్ష్మీ, నల్లతిమ్మ, వెంకటేశ్ అనే ఐదుగురు దండుపాళ్య గ్యాంగ్ సభ్యులు గీతా అనే మహిళ ఇంట్లోకి వెళ్లి మంచినీళ్లు కావాలని అడుగుతూ చాకుతో ఆమె గొంతు కోసి దారుణంగా చంపారు.
ఆ తర్వాత బంగారు నగలు, చీరలు దోచుకెళ్లారు. ఈ ఘటనపై దండుపాళ్య గ్యాంగ్ పై కామాక్షీపాళ్య పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. నిందితుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని జైలుకు తరలించారు.
ఈ కేసుపై పరప్పన అగ్రహార ప్రత్యేక కోర్టు గురువారం విచారణ చేపట్టింది. గత 17 ఏళ్లుగా సుదీర్ఘ విచారణ చేపట్టిన కోర్టు దండుపాళ్యం గ్యాంగ్ చేసిన హత్య రుజువు కావడంతో న్యాయమూర్తి శివనగౌడ ఐదుగురికీ జీవితఖైదుతో పాటు తలా రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.