బెంగళూరు కారు ప్రమాదం, పోలీసులకు లొంగిపోయిన డీకే ఆదికేశవులు నాయుడు మనమడు!
బెంగళూరు: మద్యం మత్తులో కారు నడిపి ప్రమాదానికి కారణం అయ్యి ఆసుపత్రి నుంచి తప్పించుకుని పారిపోయిన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు మాజీ ఎంపీ, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ డీకే. ఆదికేశవుల నాయుడు మనమడు గీతా విష్ణు బెంగళూరు సీసీబీ పోలీసుల ముందు లొంగిపోయాడు.
మడికేరిలో బెంగళూరు సీసీబీ పోలీసులు గీతా విష్ణును అదుపులోకి తీసుకుని బెంగళూరు తీసుకు వచ్చారు. గీతా విష్ణు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ బుధవారం బెంగళూరులోని 33వ సీసీహెచ్ న్యాయస్థానంలో విచారణకు రానుంది.
వైద్య పరీక్షలు
గీతా విష్ణుకు వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాత న్యాయస్థానంలో హాజరుపరుస్తామని బెంగళూరు సీసీబీ పోలీసు అధికారులు తెలిపారు. మంగళవారం గీతా విష్ణు ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు బుధవారం పిటిషన్ విచారణ చేస్తామని చెప్పింది.
ఫ్రెండ్స్ తో ఫోన్ చేయించాడు
గీతా విష్ణు తన స్నేహితులతో బెంగళూరు పోలీసులకు ఫోన్ చేయించి తాను మడికేరిలో ఉన్నానని, పోలీసుల ముందు లొంగిపోతానని సమాచారం ఇచ్చాడు. బెంగళూరు సీసీబీ విభాగం ఏసీపీ వెంకటేష్ ప్రసన్న నేతృత్వంలోని ప్రత్యేక బృందం మడికేరి వెళ్లి గీతా విష్ణును అదుపులోకి తీసుకున్నారు.
కారు ప్రమాదంతో గాయాలు
సెప్టెంబర్ 28వ తేది అర్దరాత్రి గీతా విష్ణు మద్యం మత్తులో బెంజ్ కారు నడిపి బెంగళూరులోని సౌత్ ఎండ్ సర్కిల్ సమీపంలో మారుతి ఓమ్ని కారును ఢీకొన్నాడు. తరువాత రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్ బోర్డును ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో గాయాలైన గీతా విష్ణును మల్యా ఆసుపత్రిలో చేర్పించారు.
కారులో గంజాయి సీజ్ !
సెప్టెంబర్ 29వ తేదీ వేకువ జామున గీతా విష్ణు మల్యా ఆసుపత్రి నుంచి తప్పించుకుని పారిపోయాడు. గీతా విష్ణు బెంజ్ కారులో 110 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్న జయనగర ట్రాఫిక్ పోలీసులు కారును సీజ్ చేసి కేసు నమోదు చేశారు. తరువాత కేసును బెంగళూరు సీసీబీ పోలీసులకు అప్పగించారు.
కటింగ్, షేవింగ్ చేసుకుని !
గీతా విష్ణు కోసం హైదరాబాద్, తమిళనాడులో పోలీసులు గాలించారు. చివరికి గీతా విష్ణు మడికేరిలో పోలీసుల ముందు లొంగిపోయాడు. పోలీసులు గుర్తు పట్టకుండా ఉండటానికి గీతా విష్ణు గడ్డం షేవ్ చేసుకుని కటింగ్ చేసుకుని తిరిగాడని వెలుగు చూసింది.