యూపీఏ పాలనకు ముగింపు, బీజేపీ అధికారంలోకి వస్తుంది!: కాంగ్రెస్ ముఖ్యమంత్రి
జైపూర్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి నోరు జారారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వం పోయి, ఎన్డీయే ప్రభుత్వం వస్తుందని చెప్పారు. ఆయన అలా చెప్పడంతో కలకలం చెలరేగింది. ఆయన తప్పును ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ సరిదిద్దారు. తాను చేసిన పొరపాటుకు గెహ్లాట్ ఆయనే నవ్వుకున్నారు.
రానున్న లోకసభ ఎన్నికల అనంతరం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వస్తోందని ఆయన అన్నారు. ఆ తర్వాత నాలుక్కరుచుకున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలో ఉన్న తప్పుని గుర్తించిన పైలట్ వెంటనే ఆయనకు ఎన్డీఏ కాదు యూపీఏ అని చెప్పారు.
అశోక్ గెహ్లాట్ ఓ కార్యక్రమం సందర్భంగా మాట్లాడారు. యూపీఏ పాలనకు 2019 లోకసభ ఎన్నికలతో ముగింపు పడుతుందన్నారు. పక్కనున్న పైలట్ ఎన్డీఏ అంటూ గుర్తు చేశారు. వెంటనే తన తప్పుని సరిదిద్దుకుంటూ గెహ్లాట్... ఎన్డీఏ పాలనకు ముగింపు పడుతుందని చెప్పి, నవ్వారు.
ఆ తర్వాత ఒకవేళ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. ఈసారి ఆయన యూపీఏ అనబోయి ఎన్డీయే అన్నారు. ఈ తప్పును కూడా గుర్తించిన సచిన్ పైలట్ గుర్తించి, యూపీఏ అని సరిదిద్దారు.
దీంతో గెహ్లాట్ అక్కడి వారు అందరూ మరోసారి గట్టిగా నవ్వారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసిన బీజేపీ జాతీయ ఐటీ ఇంచార్జ్ అమిత్ మాలవియా మాట్లాడుతూ... కొన్నిసార్లు గెహ్లాట్ నిజాలు చెబుతారన్నారు. 40 క్షణాల పాటు ఉన్న ఈ వీడియో ట్విటర్లో వైరల్ అవుతోంది. గెహ్లాట్ మన్ కీ బాత్ అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.