నిలదొక్కుకుంటుందా: భారీగా పడిపోయిన రత్నాలు, మరియు ఆభరణాల ఎగుమతులు
Recommended Video
న్యూఢిల్లీ: గత కొద్ది రోజులుగా ఆకాశాన్నంటిన పసిడి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఎగుమతుల విషయానికొస్తే రత్నాలు, నగలు ఎగుమతులు బేర్మంటున్నాయి. దాదాపు 14శాతం రత్నాలు మరియు బంగారు ఎగుమతులు ఆగష్టు నెలలో పడిపోయినట్లు లెక్కలు వెల్లడిస్తున్నాయి. అంటే రత్నాలు మరియు నగల ఎగుమతులు 2.84 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే ఆగష్టు సమయానికి వాటి ఎగుమతులు 3.32 బిలియన్ డాలర్లుగా ఉన్నింది.
రత్నాలు, నగల ఎగుమతులు పడిపోవడానికి కారణం పాలిష్డ్ వజ్రాల దిగుమతిపై అధిక సుంకం విధించడమే అని ఒకప్పుడు 2.5శాతంగా ఉన్న దిగుమతి సుంకం ఇప్పుడు 7.5శాతానికి పెంచుతూ ఈ ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో ప్రభుత్వం ప్రకటించిందని చెబుతున్నారు రత్నాలు నగల నిపుణులు. విలువైన వజ్రాలను రౌండ్ ట్రిప్పింగ్ చేయడాన్ని అరికట్టేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్.. నీరవ్ మోడీ స్కామ్లో ఇదే జరిగిందని గుర్తుచేశారు.
ఒక్కసారిగా పన్నులు పెంచడంతో రత్నాలు మరియు ఆభరణాల తయారీ పరిశ్రమ అధిక పన్నులు చెల్లించాల్సి వచ్చింది.ఇక బంగారంపై కూడా దిగుమతి సుంకంను 10శాతం నుంచి 12.5శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. రత్నాలు మరియు ఆభరణాల తయారీ పరిశ్రమలో కొన్ని ప్రధాన సంస్థలు బంగారం, వజ్రాలపై డ్యూటీ ట్యాక్స్ను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి.జీఎస్టీ వచ్చిన తర్వాత కట్ చేసి పాలిష్ చేసిన వజ్రాల ఎగుమతులు ఆగష్టు నెలకు దాదాపు 25శాతానికి పడిపోయి 1.64 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. మరోవైపు బంగార నగలు ఎగుమతులు 911 మిలియన్ డాలర్లకు అదేనెలలో ఎగబాకాయి.
ఇక ఏప్రిల్ నుంచి ఆగష్టు వరకు మొత్తంగా చూస్తే వజ్రాలు మరియు ఆభరణాల పరిశ్రమ పరిస్థితి చాలా దయనీయంగా మారింది. కట్ చేసి పాలిష్ చేయబడిన వజ్రాల ఎగుమతులు 19శాతానికి పడిపోయి 8.34 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక బంగారు నగల ఎగుమతులు కూడా 4శాతం పడిపోయి 5.02 బిలియప్ డాలర్లకు చేరుకున్నాయి. అయితే వెండి నగల ఎగుమతులు మాత్రం 83శాతం పెరిగి 437 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వజ్రాలు, నగలు , బంగారంపై అధికా పన్ను విధించడం వల్ల ప్రపంచ దేశాలతో భారత్ పోటీపడలేదని ప్రధాన నగల తయారీ సంస్థలు చెబుతున్నాయి.