ఆర్మీ చీఫ్ గా బాధ్యతలను స్వీకరించిన మనోజ్ ముకుంద్: చైనాతో సరిహద్దు వివాదాల పరిష్కర్తగా..!
న్యూఢిల్లీ: దేశ నూతన సైన్యాధ్యక్షునిగా జనరల్ మనోజ్ ముకుంద్ నరావణే మంగళవారం ఉదయం బాధ్యతలను స్వీకరించారు. దేశ రాజధానిలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కార్యాలయంలో ఆయన బాధ్యతలను చేసట్టారు. ఇప్పటిదాకా ఈ హోదాలో కొనసాగిన బిపిన్ రావత్ ను కేంద్ర ప్రభుత్వం ప్రమోషన్ కల్పించిన విషయం తెలిసిందే. ఆయనను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) గా నియమించింది. ఆయన వైదొలగడం వల్ల ఖాళీ అయిన ఆర్మీ చీఫ్ స్థానాన్ని మనోజ్ ముకుంద్ భర్తీ చేశారు.
సరిహద్దు వివాదాల పరిష్కారంలో నిపుణుడు..
దేశ సరిహద్దు వివాదాలను పరిష్కరించడంలో సిద్ధహస్తుడిగా మనోజ్ ముకుంద్ కు పేరు ఉంది. ఇదివరకు చైనా, మయన్మార్ దేశాలతో తలెత్తిన సరిహద్దు వివాదాల్లో ఆయన చురుకుగా వ్యవహరించారు. చైనాతో సిక్కిం సరిహద్దుల్లోని డోక్లాం కూడలి వివాద సమయంలో చాకచక్యంగా వ్యవహరించారు. ఈ వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్ లోని లడక్ వద్ద చైనాతో తలెత్తిన అక్సాయ్ చిన్ వివాదానికి అడ్డుకట్ట వేయడంలో మనోజ్ ముకుంద్ తనదైన శైలిలో పావులు కదిపారు.
కాశ్మీర్ సమస్యపై సమగ్ర అవగాహన..
జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల పరిస్థితులపై ఆయనకు సమగ్ర అవగాహన ఉంది. జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ సరిహద్దు వివాదాలు, చొరబాటు యత్నాలు, ఉగ్రవాదుల కదలికలపైనా మనోజ్ ముకుంద్ కు పూర్తి అవగాహన ఉంది. చాలాకాలం పాటు ఆయన కాశ్మీర్ లో రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్ కమాండెంట్ గా పనిచేశారు. అస్సాం రైఫిల్స్ బెటాలియన్ కమాండెంట్ గా పనిచేసిన సమయంలో ఈశాన్య రాష్ట్రాల స్థితిగతులపై ప్రత్యేకంగా అధ్యయనం చేశారు.