జనరల్ మోటార్స్ సంచలన నిర్ణయం: భారత్లో ఇక ఆ కార్ల అమ్మకం ఉండదు..
విక్రయాలు ఆపేసినా.. దేశీయంగా తయారీని మాత్రం కొనసాగిస్తామని సంస్థ ప్రకటించడం గమనార్హం. ఇక్కడ తయారీ ఉత్పత్తిని పెంచి, ఇతర దేశాల్లో వాటిని విక్రయాలను పెంచాలనే యోచనలో ఉంది.
అమెరికా: అమెరికన్ మల్టీనేషనల్ కార్పోరేషన్ జనరల్ మోటార్స్ కంపెనీ ఇకనుంచి తమ ఉత్పత్తులను ఇండియాలో నిలిపివేయనుంది. ఈ ఏడాది చివరి నుంచి భారత్ లో జనరల్ మోటార్స్ కార్లను విక్రయించరాదని నిర్ణయించింది. దేశంలో ఈ కంపెనీకి చెందిన ప్యాసెంజర్ కారు అమ్మకాలు 1శాతం కన్నా తక్కువ నమోదు కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
కంపెనీ పునర్నిర్మాణ చర్యల్లో భాగంగానే భారతీయ మార్కెట్ నుంచి నిష్క్రమించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా కంపెనీ తెలిపింది. విక్రయాలు ఆపేసినా.. దేశీయంగా తయారీని మాత్రం కొనసాగిస్తామని సంస్థ ప్రకటించడం గమనార్హం. ఇక్కడ తయారీ ఉత్పత్తిని పెంచి, ఇతర దేశాల్లో వాటిని విక్రయాలను పెంచాలనే యోచనలో ఉంది.
కాగా, భారత్ నుంచి ఎక్కువగా మెక్సికో, లాటిన్ అమెరికా దేశాలకు జనరల్ మోటార్స్ తన కార్లను ఎగుమతి చేస్తోంది. ఈ ఏడాది ఎగుమతులు రెట్టింపు చేయాలని జనరల్ మోటార్స్ నిర్దేశించుకుంది. కంపెనీ టలేగావ్ ప్లాంట్ ప్రస్తుతం 130,000 వాహనాలను తయారుచేసే సామర్థ్యం కలిగి ఉంది. విక్రయాల నిలిపివేతతో భారత విక్రయ సంస్థ చేవ్రొలెట్ సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను కంపెనీ మూసివేయనుందని జనరల్ మోటార్స్ తయారీ సంస్థ తెలిపింది.
భారత్ మార్కెట్ నుంచి నిష్క్రమించడం జీఎం ఇంటర్నేషనల్ ఆపరేషన్ ప్రదర్శనను మరింత బలోపేతం చేసేందుకు ఓ కీలకమైన మైలురాయిగా ఉపయోగపడుతుందని ఆ సంస్థ అధినేత స్టీఫన్ జాకోబి తెలిపారు.