భారత్లో జర్మన్ ఛాన్సెలర్ ఏంజెలా మెర్కల్: ప్రధాని మోడీతో భేటీ ..20 ఒప్పందాలపై సంతకాలు
న్యూఢిల్లీ: రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా జర్మన్ ఛాన్సెలర్ ఏంజెలా మెర్కల్ గురువారం రాత్రి న్యూఢిల్లీ చేరుకున్నారు. శుక్రవారం రోజున ప్రధాని నరేంద్ర మోడీతో ఆమె భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. దాదాపు 20 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి. గురువారం న్యూఢిల్లీకి చేరుకున్న మెర్కల్కు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ ఘనస్వాగతం పలికారు. శుక్రవారం రోజున రాష్ట్రపతి భవన్లో మెర్కల్ గౌరవ వందనం స్వీకరించనున్నారు. ఆ తర్వాత ఆమె రాజ్ఘాట్కు వెళ్లి జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులు అర్పిస్తారు.
ఇదిలా ఉంటే ప్రధాని మోడీ జర్మన్ వైస్ ఛాన్సెలర్ ఏంజిలా మెర్కల్ మధ్య భేటీ జరగడం ఇది ఐదోసారని విదేశీవ్యవహారాల శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ ట్వీట్ చేశారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మకమైన ఒప్పందాలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. ఇక ఇద్దరి భేటీ తర్వాత సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొంటారు. రవాణా, స్కిల్ డెవలప్మెంట్, ఎనర్జీ, గ్రీన్ అర్బన్ మొబైలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో పరస్పర సహకారం కోరుతూ ఒప్పందాలు చేసుకోనున్నట్లు సమాచారం.
లక్ష కోట్లు..100 ఎయిర్పోర్టులు: 2024 మోడీ సర్కార్ ప్రణాళిక ఇదే..?
ఇక శుక్రవారం సాయంత్రం ఏంజెలా మెర్కల్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో భేటీ అవుతారు. ఆ తర్వాత ప్రధాని మోడీ నివాసంలో ఆమె సమావేశం అవుతారు. అనంతరం ప్రధాని మోడీ, ఏంజెలా మెర్కల్లు వేర్వేరుగా రెండు దేశాలకు చెందిన పలు సంస్థల సీఈఓలు బిజినెస్ లీడర్లతో భేటీ అవుతారు. శనివారం రోజున గురుగ్రామ్లోని కాంటినెంటల్ ఆటోమోటివ్ కాంపొనెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ను సందర్శిస్తారు.
ప్రధాని మోడీ, జర్మన్ వైస్ఛాన్సెలర్ ఏంజెలా మెర్కల్ల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని ఈ ఇద్దరు నేతలు ఏ అంశంపైనా అయినా కూలంకుషంగా చర్చించుకుంటారని భారత్లో జర్మనీ దౌత్యవేత్త వాల్టర్ జె లిండర్ చెప్పారు. ఇక 2001 నుంచి భారత్ జర్మనీల మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. ఐరోపా దేశాల్లో జర్మనీ భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ఏప్రిల్ 2000 నుంచి చూస్తే భారత్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో జర్మనీదే అతిపెద్ద పాత్రగా ఉంది.