ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రధాన అజెండాగా మోడీ - మెర్కెల్ భేటీ
జర్మనీ ఛాన్సెలర్ ఏంజెలా మెర్కల్ నవంబర్ 1న భారత పర్యటనకు రానున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో ఆమె భేటీ కానున్నారు. పలు అంశాలపై ఇరుదేశాల అధినేతలు చర్చించనున్నారు. ఈ మధ్యకాలంలో ఆర్టికల్ 370 రద్దుతో పాటు జర్మనీ పలు అంశాల్లో భారత్కు మద్దతుగా నిలిచింది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజార్కు బాసటగా నిలిచిన చైనాను తప్పుబట్టింది. ఇక యూరోపియన్ యూనియన్లో ఉన్న దేశాలను ఏకం చేసే యోచనలో జర్మనీ, ఫ్రాన్స్లు అడుగు ముందుకు వేశాయి. ఇక కశ్మీర్ అంశంలో కూడా జర్మనీ భారత్కు అండగా నిలిచింది. ఇది భారత్ అంతర్గత సమస్య అని ఇతర దేశాల జోక్యం అనవసరమంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమాఖ్యలో పేర్కొంది.
పలు అంశాలపై చర్చించనున్న మోడీ - మెర్కెల్
ఈ క్రమంలోనే మోడీ-మెర్కెల్ల భేటీ భారత్ జర్మనీ దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యేందుకు ఉపయోగపడతాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక రెండు దేశాల మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పౌరవిమానాయాన రంగం, రైల్వే రంగాల్లో పలు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఇరుదేశాలు ఆరోగ్య రంగంలో, వ్యవసాయరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వినియోగంపై చర్చలు జరపనున్నాయి. ఇక పౌరవిమానాయాన రంగంకు సంబంధించి ఇరుదేశాధినేతలు రహస్య చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. సింహభాగం లాజిస్టిక్స్పైనే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బెంగళూరు కేంద్రంగా హైస్పీడ్ రైల్వే లింక్
ఇక రైల్వే విషయానికొస్తే దక్షిణ భారతదేశంలో రైల్వే లైన్లను పొడగించాలని ప్రభుత్వం భావిస్తోంది . అంతేకాదు బెంగళూరు నుంచి హైస్పీడ్ రైల్వే లింకును దక్షిణ భారత్కు తీసుకువచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. దీనిపై కూడా ఇరుదేశాలు ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, జర్మనీ అంతరిక్ష పరిశోధన సంస్థల మధ్య కూడా పలు అగ్రీమెంట్స్ జరిగే సూచనలున్నాయి. ఇక భారత్కు వస్తున్న మెర్కెల్ బృందంలో జర్మీనీకి చెందిన ఫుట్బాల్ లీగ్ అధికారులు కూడా రానున్నారు. ఫుట్బాల్ క్రీడపై కూడా చర్చలు జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఛాన్సెలర్ ఏంజెలా మెర్కెల్తో పాటు ఆరుగురు మంత్రులు ఇతర బృందం భారత్కు వస్తోంది.
గంగానది ప్రక్షాళనకు జర్మన్ టెక్నాలజీ
భారత అభివృద్ధిలో జర్మనీ సాయం కొనసాగుతోంది.ఇప్పటికే గంగానదిని పరిశుభ్రం చేయడంలో జర్మనీ సహకారం అందిస్తుండగా వాతావరణ మార్పులపై కూడా సహకరించేందుకు జర్మనీ ముందుకొస్తోంది. మేకిన్ ఇండియా కార్యక్రమంలో రెండు దేశాలు ఒకరికొకరికి సహకారం అందించుకోనున్నాయి. ఇప్పటికే గత ఆరేళ్లలో ప్రధాని నరేంద్ర మోడీ జర్మన్ ఛాన్సెలర్ ఏంజెలా మెర్కెల్లు డజన్ సార్లకు పైగా పలు అంతర్జాతీయ వేదికలపై కలిసి చర్చలు జరిపినందున ఈ సారి భేటీ కూడా విజయవంతం అవుతుందని భారత్ భావిస్తోంది.