సీఏఏ నిరసన: దేశం విడిచి వెళ్లాంటూ జర్మనీ విద్యార్థికి ఆదేశాలు
చెన్నై: పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. తమిళనాడులో మద్రాసు యూనివర్సిటీలో కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాగా, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్నందుకు జర్మనీకి చెందిన విద్యార్థిని అధికారులు దేశం విడిచివెళ్లిపోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
జాకబ్ లిన్డెన్తాల్ అనే విద్యార్థి స్టూడెంట్ ఎక్చ్సేంచ్ ప్రోగ్రాం కింద ఐఐటీ మద్రాసులో భౌతికశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యను అభ్యసిస్తున్నాడు. గత వారం సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలో జాకబ్ పాల్గొన్నాడు. '1933-1945 వరకు మేము ఇక్కడే ఉన్నాం', యూనిఫాం వేసుకున్న నేరస్తులు=నేరస్తులే' అని రాసివున్న ప్లకార్డులను ప్రదర్శించాడు.
ఈ ఫొటోలు అధికారుల దృష్టికి వెళ్లాయి. దీంతో జాకబ్ను విచారించి, వీసా నిబంధనలను అతిక్రమించి నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నందుకు అతడ్ని వెంటనే భారతదేశం విడిచివెళ్లిపోవాలని ఆదేశించారు. దీంతో అతను సోమవారం రాత్రి జర్మనీకి బయలుదేరినట్లు సమాచారం.
అర్ధాంతరంగా సెమిస్టర్ మధ్యలో విద్యార్థిని దేశం నుంచి పంపడాన్ని ఐఐటీ మద్రాసు విద్యార్థులు తప్పుబట్టారు. దీనిపై ఐఐటీ అధికారులు స్పందించాల్సి ఉంది. కాగా, అధికారుల తీరును రాజకీయ నాయకులు, కాంగ్రెస్ నేతలు తప్పుబట్టారు.
మన ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఆదర్శంతంగా ఉండాలి. ఏ ప్రజాస్వామ్యం భావ ప్రకటనా స్వేచ్ఛను శిక్షించదు. విద్యార్థి బహిష్కరణను ఉపసంహరించుకునేలా ఐఐటీ మద్రాసు వారిని ఆదేశించమని కోరుతున్నాను. విద్యారంగంలో భారత్ ప్రపంచానికే ఆదర్శంగా ఉండాలని కాంగ్రెస్ నేత, ఎంపీ శశిథరూర్ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ నిషాంక్ను ట్యాగ్ చేశారు. ఆయన దీనిపై స్పందించాల్సివుంది.