రివర్స్ ఫర్ క్లీన్: ‘ఇక్కడ మూత్రం పోస్తే.. రూపాయి ఇస్తారు’
అహ్మదాబాద్: బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జనను అరికట్టేందుకు గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(ఏఎంసి) ఓ కొత్త ఆలోచనను అమల్లోకి తీసుకొచ్చింది. అదే ‘రూపీ ఫర్ పీ(మూత్రానికి రూపాయి)' పథకం. గురువారం నుంచి ఈ పథకం అహ్మదాబాద్లో అమల్లోకి వచ్చింది.
ఈ ఆలోచనను మొట్టమొదట నేపాల్లోని డారెక్చౌక్లో అమలు చేశారు. అయితే అక్కడ విజయవంతం కావడంతో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని ముందుకు వచ్చింది. దీంతో ‘ఇక్కడ మూత్రం చెయ్యి.. రూపాయి తీసుకో' అనే నినాదంతో నగరంలో అనేక చోట్ల పబ్లిక్ టాయ్లెట్లు వెలిశాయి. దాదాపు 67 సెంటర్లలో వీటిని నిర్వహిస్తున్నారు.
అహ్మదాబాద్ నగరంలో పారిశుధ్య పరిస్థితులను మెరుగుపర్చేందుకు ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిషన్ సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని మున్సిపల్ అధికారులు తెలిపారు.
నగరంలో దాదాపు 300 పబ్లిక్ టాయ్లెట్లు ఉన్నా.. బహిరంగ మూత్ర విసర్జన వల్ల నగరంలోని 67 ప్రాంతాలు దుర్గంధ పూరితంగా తయారయ్యాయని స్టాండింగ్ కమిషన్ ఛైర్మన్ ప్రవీణ్ పటేల్ తెలిపారు. అందుకే ప్రజల ఆరోగ్యం సంరక్షణ కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు సిఫారసు చేశామన్నారు.
ప్రస్తుతం 67 సెంటర్లలో మాత్రమే మూత్రానికి రూపాయి పథకం అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. పబ్లిక్ టాయ్లెట్లు వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ స్కీమ్ను ప్రవేశపెట్టామని అధికారులు చెప్పారు. వ్యాపార ప్రకటనల ద్వారా దీనికి సంబంధించిన వనరులను సమకూర్చుకుంటామని తెలిపారు.