డేరా బాబా అల్లర్లలో ‘ఎర్ర సంచి’దే కీలక పాత్ర: ఏం జరిగిందంటే?
గుర్మీత్ను కోర్టు దోషిగా తేల్చిన తర్వాత అతడి అనుచరులు చెలరేగిపోయి విధ్వంసానికి పాల్పడిన విషయం తెలిసిందే.అయితే అల్లర్ల నేపథ్యంలో కోర్టు తీర్పును చాలాసేపటి వరకు గోప్యంగా ఉంచినప్పటికీ..
చండీగఢ్: ఇద్దరు బాలికలపై అత్యాచారం చేసిన కేసులో 20ఏళ్ల జైలు శిక్ష విధింపబడిన డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ గురించిన మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 25న హర్యానాలోని పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు గుర్మీత్ను దోషిగా తేల్చగా.. గత సోమవారం శిక్ష ఖరారైంది. గుర్మీత్కు సీబీఐ న్యాయమూర్తి 20ఏళ్లపాటు శిక్షను విధించారు.
డేరా బాబాపై వాజ్పేయికి బాధితురాలి లేఖ: మోడీ హయాంలో శిక్ష, బాధితురాలు ఏమన్నారంటే?
గోప్యంగా ఉంచితే ఎలా తెలిసింది?
కాగా, గుర్మీత్ను కోర్టు దోషిగా తేల్చిన తర్వాత అతడి అనుచరులు చెలరేగిపోయి పెను విధ్వంసానికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే అల్లర్ల నేపథ్యంలో కోర్టు తీర్పును చాలాసేపటి వరకు గోప్యంగా ఉంచినప్పటికీ.. గుర్మీత్కు శిక్ష పడిన సంగతి అతడి అనుచరులకు ఎలా తెలిసిందనేదానిపై పోలీసులు ఆరా తీశారు.
అంతా ‘ఎర్రసంచి’ వల్లే
తీర్పు దృష్ట్యా పంచకులలో విద్యుత్, ఇంటర్నెట్, మొబైల్ సేవలను నిలిపివేసినా డేరా అనుచరులు ఎలా తెలుసుకున్నారు. ఈ ప్రశ్నలకు హర్యానా పోలీసులు సమాధానాలు చెప్పారు. వీటన్నింటికీ కారణం డేరా బాబా చేతిలోని ఓ ఎర్ర బ్యాగ్ అని తేలింది. ఈ మేరకు వివరాలను ఐజీ కేకే రావు తెలిపారు.
ఆ సంచితే సంకేతాలిచ్చారు..
‘పంచకుల సీబీఐ కోర్టులో తీర్పు వెలువడగానే గుర్మీత్ను కోర్టు వెలుపలికి తీసుకొచ్చాం. సరిగ్గా ఆ సమయంలోనే గుర్మీత్ తన ఎర్రబ్యాగును ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. అందులో తన బట్టలున్నాయని చెప్పాడు. ఆ బ్యాగును సిర్సా నుంచి తనతో పాటు తెచ్చుకున్నాడు. అయితే అతడు బ్యాగ్ అడిగింది తన శిష్యులకు సంకేతాలు ఇచ్చేందుకే. తనను దోషిగా తేల్చారని తన అనుచరులకు చెప్పడానికి గుర్తుగా డేరా బాబా ఆ బ్యాగును పట్టుకున్నాడు. గుర్మీత్ కారు నుంచి బ్యాగ్ను బయటకు తీసిన వెంటనే.. కొద్ది దూరంలో పేలుడు శబ్ధాలు వినిపించాయి. దీంతో బ్యాగుతో గుర్మీత్ తన అనుచరులకు సంకేతాలు ఇచ్చినట్లు అర్థమైంది' అని ఐజీ కేకే రావు వివరించారు.
తప్పిస్తారని భావించాడు..
‘అంతేగాక కోర్టు నుంచి బయటకు వచ్చాక గుర్మీత్ వాహనంలో కూర్చునేందుకు కొంత సమయం తీసుకున్నాడు. చేతిలో బ్యాగు పట్టుకుని కారిడార్లో తిరుగుతూ కన్పించాడు. దీని వల్ల తన అనుచరులకు విషయం తెలుస్తుందనుకున్నాడు. దీంతో వారు అల్లర్లు సృష్టించి తనను అక్కడి నుంచి తప్పిస్తారని భావించాడు' అని కేకే రావు తెలిపారు.
ప్రమాదాన్ని గమనించాం..
‘అయితే విషయం మాకు అర్థమవడంతో జాగ్రత్తగా వ్యవహరించాం. వెంటనే గుర్మీత్ను అక్కడి నుంచి తీసుకెళ్లాలని నిర్ణయించాం. ఇందుకోసం ప్రత్యేక హెలికాప్టర్ను ఏర్పాటుచేశాం. కానీ.. అక్కడ కూడా ఓ సమస్య వచ్చింది. గుర్మీత్ను హెలిపాడ్కు తీసుకెళ్లే దారిలో అతడి అనుచరులు 70 వాహనాల్లో వేచి ఉన్నారు. దీంతో ప్రమాదాన్ని ఊహించి.. వెంటనే మార్గాన్ని మార్చాం. ఆర్మీ నుంచి అనుమతి తీసుకుని కంటోన్మెంట్ మీదుగా గుర్మీత్ను హెలిప్యాడ్ వద్దకు తీసుకొచ్చాం. అనంతరం అతడిని రోహ్తక్ జైలుకు తరలించాం' అని కేకే రావు వివరించారు.
తప్పించే యత్నం భగ్నం
‘కాగా, డేరా బాబాను ఎక్కడికి తరలించింది అతని అనుచరులకు తెలియకపోవడంతో వారు అరగంటపాటు ఆందోళనలోనే ఉండిపోయారు. ఆ ఎర్రసంచి గురించిన సమాచారం తమకు ఆలస్యంగా తెలిసింది. ఆ ఎర్ర సంచిని బాబా కావాలని కోరడం, భారీ ఎత్తున చేరుకోవడం, అంతేగాక, బాబా అనుచరుల 70 వాహనాలు అక్కడి రావడంతో అనుమానం వచ్చింది. వెంటనే అప్రమత్తమవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది' అని తెలిపారు.