కాంగ్రెస్ మెడకు మహారాష్ట్ర ఉచ్చు: అసమ్మతి భగ్గు: వచ్చే ఏడాదే మధ్యంతర ఎన్నికలు: సీనియర్
ముంబై: మహారాష్ట్రంలో నెలకొన్ని రాజకీయ సంక్షోభ అటు తిరిగి, ఇటు తిరిగి కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శివసేనకు మద్దతు ఇవ్వడం పట్ల అసమ్మతి రాజుకుంటోంది. మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సంజయ్ నిరుపమ్ ఇప్పటికే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. శివసేనకు మద్దతు ఇవ్వడం స్వయం కృతాపరాధమౌతుందని, పార్టీ మూలాలు దెబ్బతింటాయని హెచ్చరికలు పంపిన ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. పైగా తన అసమ్మతి స్వరాన్ని మరింత తీవ్రం చేశారు.
రాష్ట్రపతి పాలన దిశగా మహారాష్ట్ర: మా బంధం ఫెవికాల్, సిమెంట్ కంటే దృఢం: బీజేపీ
అధికారం కావాలా? లౌకికవాద కావాలా? నిలదీస్తోన్న నిరుపమ్
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో శివసేనకు మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ ముందుకొస్తే.. అది పార్టీ తీసుకున్న చారిత్రక తప్పిదం అవుతుందని సంజయ్ నిరుపమ్ అన్నారు. పార్టీ నాశనమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ మూలాలే దెబ్బతింటాయని చెప్పారు. లౌకికవాద పార్టీగా ఉన్న ముద్ర చెరిగిపోయే ప్రమాదం ఉందని, ఫలితంగా- పార్టీకి అండదండగా ఉంటూ వస్తోన్న కొన్ని వర్గాల ప్రజలు దూరమౌతారని అన్నారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ఆయన ఓ ట్వీట్ చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్-ఎన్సీపీ కూటమిని ఆహ్వానించాలంటూ మిలింద్ దేవ్ రా ట్వీట్ చేసిన కాస్సేపటికే నిరుపమ్ కూడా ఓ ట్వీట్ పోస్ట్ చేశారు.
శివసేనతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయగలమా?
శివసేనతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇప్పటికిప్పుడు భారతీయ జనతాపార్టీపై పైచేయి సాధించినట్టు కనిపిస్తుందే తప్ప దాని వల్ల ప్రయోజనం ఉండదని సంజయ్ నిరుపమ్ అన్నారు. భవిష్యత్తులో వచ్చే ఎలాంటి ఎన్నికల్లోనూ శివసేనతో కలిసి పోటీ చేయగలమా? అని ఆయన నిలదీశారు. మతతత్వ పార్టీగా ముద్ర పడిన శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం ఆత్మహత్యా సదృశ్యమౌతుందని చెప్పారు. అధికారాన్ని అందుకోవడం కంటే ప్రతిపక్షంలో కూర్చోవడమే మేలని సూచించారు. శివసేనతో సీట్ల సర్దుబాటు చేసుకుని ఎన్నికలకు వెళ్తే చేదు ఫలితాలు తప్పవని అన్నారు.
ప్రస్తుత సమీకరణాల్లో ఏ పార్టీ కూడా..
మహారాష్ట్ర రాజకీయాల్లో ఓ విచిత్ర పరిస్థితులు ఏర్పడ్డాయని, రాజకీయ సమీకరణాలు ఏ ఒక్క పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా దోహద పడేలా లేవని అన్నారు. కాంగ్రెస్-ఎన్సీపీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యమని సంజయ్ నిరుపమ్ తేల్చి పడేశారు. శివసేనతో కలిసి అధికారాన్ని అందుకోవడానికి చేసే ప్రయత్నాల నుంచి వెంటనే విరమించుకోవాలని చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఆలోచన కూడా చేయకూడదని అన్నారు. అలాంటి నిర్ణయం తీసుకున్నా, ఆ దిశగా అడుగులు వేసినా అది పార్టీ నాశనానికి దారి తీస్తుందని హెచ్చరించారు.
అస్థిరత కొనసాగుతుంది..
ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేసినప్పటికీ మహారాష్ట్రలో అస్థిర ప్రభుత్వమే కొనసాగుతుందని అన్నారు. ఈ అస్థిర ప్రభుత్వం ఎన్నో రోజులు కొనసాగదని, అయిదేళ్ల పాటు ప్రభుత్వం మనుగడ కొనసాగించడం అసాధ్యమని చెప్పారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాల్సిందేనని జోస్యం చెప్పారు. చేతికి అందిన అధికారాన్ని కోల్పోయిన తరువాత బీజేపీ చూస్తూ కూర్చోబోదని, ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి వ్యూహాలు పన్నుతుందని, దాన్ని ఎదుర్కొనే సత్తా ఉండాలని అన్నారు. వాటన్నిటి కంటే ప్రతిపక్షంలో కూర్చోవడమే మేలని తేల్చి చెప్పారు.