గోవులు గేదెలు కాదు.. పనికొచ్చే పనుల గురించి ఆలోచించండి: కపిల్ సిబాల్
ఢిల్లీ: పనికొచ్చే పనులు, పనికొచ్చే విషయాలు మాట్లాడాలని సీనియర్ కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ ప్రధాని మోడీకి సూచించారు. "ఓమ్, గోవు'' అనే పదాలు వినగానే కొందరు దేశం 16వ శతాబ్దానికి వెళ్లిపోయిందనే భావనలో ఉన్నారంటూ బుధవారం ప్రధాని వ్యాఖ్యానించిన నేపథ్యంలో కపిల్ సిబాల్ ఇందుకు పై విధంగా సమాధానం ఇచ్చారు. దేశంలోని యూనివర్శిటీలపై ప్రేమ చూపాలని కోరారు. రాజకీయంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే బదులు ఆసమయం యూనివర్శిటీలను ఎలా అభివృద్ధి చేయాలో ఆలోచన చేస్తే బాగుంటుందని హితవు పలికారు కపిల్ సిబాల్.
2012 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 300 యూనివర్శిటీలో భారత్కు చోటు దక్కలేదని తెలిపారు. ఈ అంశంపై వర్కౌట్ చేయాలని సూచిస్తూ కపిల్ సిబాల్ ట్వీట్ చేశారు. ఓం , గోవు అనే పదాలు విన్నప్పుడు దేశం 16వ శతాబ్దంలోకి వెళ్లిపోయిందనే భావన కొంతమందిలో నెలకొందని వ్యాఖ్యానించారు ప్రధాని నరేంద్ర మోడీ. బుధవారం ఉత్తర్ప్రదేశ్లోని మథురాలో పర్యటించిన ప్రధాని స్వచ్ఛ్తాహీ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత మరిన్ని కార్యక్రమాల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని ఓం, గోవుపై పలు వ్యాఖ్యలు చేశారు.
Modiji : Instead of politically charged statements on Om and the Cow worry about our Universities !
— Kapil Sibal (@KapilSibal) September 12, 2019
First time since 2012 :
No Indian University in the in the top 300 World University Rankings list (Times Higher Education )
Get to work on issues that matter
ఇదిలా ఉంటే స్వతహాగా సుప్రీంకోర్టు న్యాయవాది అయిన కపిల్ సిబాల్ ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్రమంత్రి చిదంబరం తరపున కపిల్ వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసు వాదిస్తుండటంతో ప్రతిరోజు సిబాల్ వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నారు. తాజాగా ఢిల్లీ హైకోర్టులో చిదంబరం బెయిల్కోసం తన వాదనలు వినిపించారు కపిల్ సిబాల్. అయితే ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించిన విచారణ స్టేటస్ ఏడురోజుల్లోగా కోర్టుకు సమర్పించాలని న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది.