మతమార్పిళ్లు ఆగనంతవరకు ‘ఘర్ వాపసీ’ కొనసాగుతుంది: బిజెపి ఎంపి
రోహ్తక్: మత మార్పిడులపై నిషేధం విధించనంతవరకు విశ్వహిదూ పరిషత్ ‘ఘర్ వాపసీ' కొనసాగుతుందని భారతీయ జనతా పార్టీ పార్లమెంటుసభ్యుడు యోగి ఆదిత్యనాథ్ తేల్చి చెప్పారు. భారతదేశానికి పేదరికం సమస్య కాదన్న ఆయన, ఓటు బ్యాంకు రాజకీయాలే జిహాద్కు ఆజ్యం పోస్తున్నాయని అన్నారు.
‘మత మార్పిడులు దేశంలో మత సామరస్యానికి భంగం కలిగిస్తున్నాయి. అందుకే దీనిపై నిషేధం విధించాలి. ఒక వేళ మతమార్పిడులు కొనసాగితే, నా అభిప్రాయం ప్రకారం ‘ఘర్ వాపసీ' కూడా కొనసాగుతుంది' అని విహెచ్పి సమావేశంలో యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ముస్లిం ప్రాంతాల్లో దేశ వ్యతిరేక కార్యకలాపాలు మొగ్గతొడుతున్నాయని ఆరోపించారు. తన ప్రశ్నలకు సెక్యూలరిస్టులు సమాధానం చెప్పాలని అన్నారు.
‘భారతదేశానికి పోషకాహార లోపం లేదా పేదరికం సమస్య కాదు. జిహాద్ను ప్రోత్సహించే ఓటు బ్యాంకు రాజకీయాలే ప్రధాన సమస్య. హిందూ సమాజంలో ప్రతీ ఒక్కరూ భద్రంగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఇక్కడ ప్రతీ వ్యక్తికి, అన్ని మతాల వారికీ రక్షణ ఉంది' అని తెలిపారు.
అయితే ముస్లింలు ఎందుకు అభద్రతా భావానికి గురవుతున్నారో తెలియడం లేదని అన్నారు. జాతి వ్యతిరేక కార్యకలాపాలు ఇక్కడ ఎందుకు మొలకెత్తుతున్నాయని ప్రశ్నించారు. వారందెకు జిహాద్కు దగ్గరవుతూ.. భారత్ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు? అని యోగి ప్రశ్నించారు.
‘ఇండియా-పాకిస్థాన్ మ్యాచులో ఒక వేళ ఇండియా గెలిస్తే వారు విచారం వ్యక్తం చేస్తారు. ఓడిపోతే పటాసులు పేల్చి సంబరాలు చేసుకుంటారు. ఎందుకు? దీనిపై సెక్యూలరిస్టులు ఎందుకు ప్రశ్నించారు?' అని ఆదిత్యనాథ్ అన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మించడం జరుగుతుందని చెప్పారు. ఏకరూప చట్టం కోసం పోరాటం చేస్తామని అన్నారు.