ప్రయాణికుల గూబ గుయ్యిమనిపిస్తోన్న ఓలా : 80వేల బిల్లు చూసి షాక్
ముంబై : సాంకేతిక సమస్యలు ఓలా ప్యాసింజర్స్ కు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రయాణమంతా బాగానే ఉంటుంది కానీ.. బిల్లు చూసినప్పుడే ప్రయాణికుడి గుండె బేజారయ్యేలా తయారైంది పరిస్థితి. దీంతో క్యాబ్ డ్రైవర్లకు ప్యాసింజర్స్ కు మధ్య వాగ్వాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి.
తాజాగా ముంబైలో ఇదే తరహా ఘటన జరిగింది. ముంబై లోని ఘట్కోపర్ కు చెందిన కమల్ భాటియా అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి పుణేలో జరిగే ఓ వివాహ వేడుక కోసం హాజరయ్యేందుకు ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నాడు. ప్రయాణమంతా బాగానే జరిగింది. తీరా అక్కడి దిగిన తర్వాత రూ.83,395 బిల్లును చూసి కమల్ భాటియా నోరెళ్లబెట్టాడు.
ఇదేంటని నిలదీస్తే.. అప్పుడు గానీ అసలు విషయం బయటపడలేదు. నిజానికి ఆ సమయంలో క్యాబ్ ప్రయాణించింది 349కి.మీ అయినప్పటికీ.. ఇన్వాయిస్ లో మాత్రం 14 గంటల్లోనే 7 వేల కిలో మీటర్లు ప్రయాణించినట్లుగా వచ్చింది. దీంతో డ్రైవర్ కు భాటియా మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకోగా.. ఆ తర్వాత అది సాంకేతిక సమస్య కారణంగా జరిగిన పొరపాటని గుర్తించాడు డ్రైవర్.
అనంతరం కాల్ సెంటర్ కు ఫోన్ చేసి జరిగిన తప్పిదం గురించి వివరించి బిల్లును సవరించేశాడు. అప్పుడు లెక్క తేలిన అసలైన బిల్లు ఎంతంటే రూ.4,808. 8వేలకు 4వేలకు ఎంత తేడా! అప్రమత్తంగా ఉండకపోతే నిలువు దోపిడీయే.
ఇదిలా ఉంటే.. ఇటీవల హైదరాబాద్ లోని ఓ వ్యక్తికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి నిజమాబాద్ కు వెళ్లినందుకు గాను రతీశ్ శేఖర్ అనే వ్యక్తికి ఓలా క్యాబ్ రూ.9.15లక్షలు బిల్లు వేసింది. ఆ సమయంలో క్యాబ్ ప్రయాణించింది 450 కి.మీ కాగా మీటర్ రీడింగ్ మాత్రం ఏకంగా 85,427కి.మీ అని చూపించింది.