కూతుళ్ల ముందే జర్నలిస్టును కాల్చి చంపేశారు: మేనకోడలికి వేధింపుల ఫిర్యాదే కారణమా?
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. సోమవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఓ జర్నలిస్టును కొందరు దుండగులు కాల్చి చంపేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
సోదరి ఇంటికి వెళ్లిన జర్నలిస్టు విక్రమ్ జోషి తన బైక్పై ఇద్దరు కూతుళ్లతో తిరిగివస్తున్నారు. ఈ క్రమంలో ఐదుగురు దుండగులు ఒక్కసారిగా ఆయనపై కాల్పులకు తెగబడ్డారు. ఆ తర్వాత అక్కడ్నుంచి పరారయ్యారు. తీవ్రగాయాలపాలైన జర్నలిస్టును నగరంలోని యశోద ఆస్పత్రికి తరలించారు.
ఘజియాబాద్ విజయన్ నగర్ ప్రాంతంలో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు చేయబడ్డాయి. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు.. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు జోషి కుటుంబానికి తెలిసినవారేనని పోలీసులు తెలిపారు.
ఒక్కసారిగా నిందితులు దాడి చేయడంతో బైక్ కిందపడింది. భయాందోళనలకు గురైన జర్నలిస్టు జోషి కూతుళ్లు దూరంగా పరుగులు తీశారు. ఆ తర్వాత జోషిని నిందితులు ఈడ్చుకెళ్లి దాడి చేశారు. అతనిపై కాల్పులు జరిపారు. తీవ్రగాయాలతోపాటు పడివున్న తండ్రి వద్దకు వెళ్లిన కూతుళ్లు సాయం కోసం కేకలు వేశారు.
కొందరు స్థానికులు వచ్చి అతడ్ని ఆస్పత్రికి తరలించేందుకు సాయం చేశారు. తన మేనకోడలును కొందరు దుండగులు వేధింపులకు గురిచేస్తున్నారని స్థానిక విజయన్ నగర్ పోలీస్ స్టేషన్లో జోషి ఫిర్యాదు చేసిన తదుపరి రోజే ఈ దారుణ ఘటన జరగడం గమనార్హం.